ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేసి, ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కసిరెడ్డి వి రాజేంద్రనాథ్ రెడ్డికి రాష్ట్ర డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. గౌతమ్ సవాంగ్ ను ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
“ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఈరోజు మధ్యాహ్నం వరకూ విధుల్లో ఉన్న గౌతమ్ సవాంగ్ ను ఆకస్మికంగా ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించడం విస్మయం కలిగించింది. అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావచ్చు. కానీ వైసీపీ ప్రభుత్వానికి డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందో? ఇందుకు గల కారణాలను ప్రజలకు తెలియచెప్పాలి. లేని పక్షంలో విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే సవాంగ్ పై బదిలీ వేటు వేశారని భావించాల్సి వస్తుంది. ఉన్నతాధికారుల నుంచి చిన్నపాటి ఉద్యోగి వరకూ అందరినీ హెచ్చరించి, భయపెట్టి, అదుపు చేసేందుకు సవాంగ్ బదిలీని ఉదాహరణగా చూపించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది. ఈ బదిలీ తీరు చూస్తే వైసీపీ ప్రభుత్వం చీఫ్ సెక్రెటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను ఆకస్మికంగా పక్కకు తప్పించడమే గుర్తుకు వస్తుంది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ