పొత్తు పెట్టుకొని వైసీపీ సర్కార్పై యుద్ధానికి వెళ్తున్నాయి జనసేన, తెలుగు దేశం పార్టీలు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ సర్కార్ను గద్దె దించి.. అధికారం దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. వైసీపీని ఓడించేందుకువున్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా చేజార్చుకోకుండా ముందుకువెళ్తున్నాయి. వైసీపీలో అసంతృప్తిగావున్న నేతలకి గాలం వేసి.. తమవైపు లాక్కుంటున్నాయి. ఇప్పటికే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగు దేశం పార్టీలో చేరిపోయారు. మరికొందరు కూడా చేరేందుకు గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు.
ఈ పరిణామాల మధ్య ఓ కీలక నేత జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేనలో చేరేందుకు సముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్లో జనసేనాని పవన్ కళ్యాణ్తో కొణతాల రామకృష్ణ సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయాలు.. ప్రస్తుత పరిస్థితులు.. త్వరలో జరగబోయే ఎన్నికలపై ఇద్దరూ చర్చలు జరిపారు. అనంతరం రామకృష్ణను జనసేనాని పార్టీలోకి ఆహ్వానించగా.. అందుకు ఆయన సముఖత వ్యక్తం చేశారట. జనసేనలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
కొణతాల రామకృష్ణ 1989 నుంచి 1996 వరకు ఎంపీగా కొనసాగారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో ఎక్సైజ్,న్యాయశాఖ మంత్రిగా కూడా కొణతాల పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు మంత్రిగా కొనసాగారు. ఇక వైఎస్సార్ మరణం తర్వాత వైసీపీలో చేరారు. ఇక 2014 ఏపీ ఎన్నికల తర్వాత కొంతకాలం కొణతాల రామకృష్ణ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాటం మొదలు పెట్టారు.
ఇక ఇప్పుడు జనసేనలో చేరేందుకు కొణతాల సిద్ధమయ్యారు. ఆయన జనసేనలో చేరితే ఆ పార్టీకేకాకుండా.. కొణతాలకు కూడా ప్రయోజనం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక కొణతాలకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని జనసేనాని భావిస్తున్నారట. గతంలో ఆ స్థానం నుంచి రామకృష్ణ ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు ఆ టికెట్ కొణతాలకు ఇస్తే కచ్చితంగా గెలిచి తీరుతారని పవన్ భావిస్తున్నారట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE