ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఈ రోజు తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు సమావేశం అయిన సంగతి తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ తో జరిగిన సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబెల్ స్టార్ ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నటులు అలీ, పోసాని కృష్ణమురళి, ఆర్ నారాయణమూర్తి, నిర్మాత నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఏపీలో సినిమా టికెట్ ధరల పెంపు అంశం, పరిశ్రమ ఎదుర్కుంటున్న సమస్యలు, థియేటర్స్ కు రాయితీలు సహా పలు సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశం అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, సినీ పరిశ్రమ సంక్షోభానికి నేటితో శుభంకార్డు పడినట్లుగా భావిస్తున్నామని అన్నారు. ఫిబ్రవరి నెల చివరి వారం నాటికి టికెట్ల రేట్లపై జీవో విడుదల చేసే అవకాశం ఉందని, చిన్న సినిమాలను దృష్టిలో పెట్టుకుని 5వ షోకు కూడా సీఎం ఆమోదం తెలిపారన్నారు.
సీఎం వైఎస్ జగన్ కు పరిశ్రమలోని ప్రతి ఒక్కరి తరపున మరోమారు కృతజ్ఞతలు:
అలాగే చిరంజీవి ట్విట్టర్ వేదికగా కూడా మరోమారు సీఎం వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. “తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ అన్ని కోణాల్లో అర్థం చేసుకుని, పూర్తి అవగాహనతో, ఎంతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపి, సమస్యలపై ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవడమే కాక, తెలుగు చిత్ర పరిశ్రమకు భవిష్యత్ కార్యక్రమాన్ని సూచిస్తూ, పరిశ్రమకి అన్ని రకాలుగా అండగా వుంటానని భరోసా ఇస్తూ ఎంతో సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి పరిశ్రమలోని ప్రతి ఒక్కరి తరపున మరో మారు కృతజ్ఞతలు. త్వరలోనే అధికారికంగా పరిశ్రమకి శుభవార్త అందుతుందని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చిన భరోసాతో, మీరు చేసిన దిశానిర్దేశం తో తెలుగు పరిశ్రమ రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళుతుందన్న నమ్మకంతో హృదయ పూర్వక ఆనందాన్ని తెలియచేస్తూ థాంక్యూ శ్రీ వైఎస్ జగన్” అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ