రాష్ట్రంలోని రాక్షస పాలన అంతం చేయడమే వారాహి ముఖ్య లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాలకు మేలు జరగాలని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు. బుధవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారాహి నుంచి పవన్ కళ్యాణ్ తొలి పలుకులుగా ‘జై భవానీ’ అంటూ అమ్మవారి పేరు భక్తిపూర్వకంగా స్మరించారు. అనంతరం [పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ, రాజకీయాల్లోకి యువతరం రావాలని, తెలుగు రాష్ట్రాలు ఐక్యంగా అభివృద్ధి సాధించాలని అమ్మ వారిని కోరుకున్నట్లు చెప్పారు. కచ్చితంగా వారాహితో త్వరలోనే ప్రజలను కలుసుకుంటాను అన్నారు.
వారాహి వాహనం పూజల్లో వారికీ సహకరించిన విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ ఈవో, అధికారులు, వేద పండితులు, అర్చకులు, పోలీసులు, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ సిబ్బందికి, శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. ముందుగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఉదయం వేళ నేరుగా అమ్మవారి ఆలయానికి చేరుకొని, అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కి ఆలయం మర్యాదలతో ఆలయ ఈవో భ్రమరాంబ, ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారిని అంతరాలయం గుండా దర్శించుకున్న పవన్ కళ్యాణ్, మనోహర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్ కి ఆలయ ఆవరణలో వేద పండితుల ఆశీర్వచనం అందించారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటం అందించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మేలు జరిగేలా శ్రీ దుర్గమ్మ ఆశీర్వదించాలని వేడుకున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు.
వారాహి వాహనానికి పూజ అనంతరం పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపైకి ఎక్కి వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ నుంచి అభిమానులు జనసేనానిపై పూల వర్షం కురిపించారు. డప్పు చప్పుళ్లు, బాణ సంచా పేలుళ్లతో విజయవాడ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. దుర్గమ్మ ఆలయం బయట ప్రత్యేకంగా తయారు చేయించిన గజమాలతో సత్కరించారు. తన కోసం తరలి వచ్చిన ఆశేష జనవాహినికి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియచేశారు. వాహన పూజ, ప్రసంగం అనంతరం వారాహిలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పోతిన వెంకట మహేష్, అమ్మిశెట్టి వాసు, అక్కల గాంధీ, తంగెళ్ల ఉదయ్, మండలి రాజేష్, బూరగడ్డ శ్రీకాంత్, కిషోర్, బొలియాశెట్టి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE