ఈనెల 27వ తేదీ నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ సందర్శించి తన తాత, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, సీనియర్ నేత సంభంపాటి రామ్మోహన్ రావు సహా పలువురు పార్టీ నాయకులు లోకేష్ వెంట వచ్చారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు లోకేష్ వాహనాన్ని అనుసరిస్తూ భారీ బైక్ ర్యాలీ తీశాయి. అంతకుముందు ఇక పాదయాత్ర నేపథ్యంలో నారా లోకేష్ ఇంటివద్ద బయలుదేరే సమయంలో తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి మరియు అత్తమామలు నందమూరి బాలకృష్ణ, వసుంధర దంపతుల కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
అనంతరం సతీమణి బ్రాహ్మణి హారతి ఇచ్చి నుదుట తిలకం దిద్దారు. మామ బాలకృష్ణ వెంటవచ్చి కారు ఎక్కించగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు బయలుదేరారు. ఇక ఘాట్ వద్ద ఎన్టీఆర్ కు నివాళులర్పించిన తర్వాత లోకేష్ శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడినుంచి నేరుగా కడప వెళ్లనున్నారు. ఈ క్రమంలో సాయంత్రం 5.15 గంటలకు కడప అమీన్ పీర్ దర్గా సందర్శిస్తారు. అనంతరం కడపలోని రోమన్ కేథలిక్ చర్చిలో సాయంత్రం 6.30కి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు. ఆ తర్వాత రోడ్డుమార్గంలో తిరుమల చేరుకుని ఈరోజు రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకుంటారు. అక్కడి నుండి బయలుదేరి మధ్యాహ్నం 2.30కి కుప్పం చేరుకుంటారు. 27వ తేదీ నుంచి పాదయాత్ర ఆరంభిస్తారు. కాగా మొత్తం 400 రోజుల పాటు చేయనున్న ఈ పాదయాత్రలో ఏపీ వ్యాప్తంగా లోకేష్ 4,000 కి.మీ దూరం నడవనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE