తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఏపీలో కనుమరుగయ్యిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి..షర్మిల రాక కలిసి వచ్చినట్లే అయింది. మొన్నటి వరకూ ఏపీలో కాంగ్రెస్ పేరును మరచిపోయిన నేతలు ఇప్పుడు హస్తం జపం చేయడంతో ఆ పార్టీకి పూర్వ వైభవం వచ్చినట్లు అయింది. నిజానికి దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టాక.. పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపడానికి ఏపీ వ్యాప్తంగా పర్యటనలు చేయడం హస్తం పార్టీకి ప్లస్ అవుతోంది.
ఇప్పుడు ఈ ఉత్సాహంతోనే కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలలో పోటీ చేయడానికి గెలుపు గుర్రాల వేటలో పడింది. దీనికోసం ఏపీలోని 175 అసెంబ్లీ సిగ్మెంట్లతో పాటు 25 పార్లమెంట్ నియోజకవర్గాలలో పోటీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించింది.అయితే ఈ దరఖాస్తుల ఆహ్వానానికి భారీ స్పందన లభిస్తోండటంతో కాంగ్రెస్ వర్గాలలో జోష్ పెరుగుతోంది. ఈ దరఖాస్తులకు ఇంకా ఒక రోజు గడువు ఉండగానే.. ఇప్పటివరకు 175 అసెంబ్లీ స్థానాల కోసం 793 దరఖాస్తులు రాగా.. 25 పార్లమెంట్ స్థానాలకు 105 మంది దరఖాస్తులు చేసుకున్నారు.
దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీలో వస్తున్న మార్పులపై రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఉనికిలో లేదని అనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం వైఎస్ షర్మిల నాయకత్వమే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో వైఎస్ఆర్ పాలనను తిరిగి తీసుకొస్తాననే మాటను ఆయుధంగా చేసుకున్న షర్మిల.. జగన్ను టార్గెట్గా చేస్తూ చేస్తున్న కామెంట్లకు వైసీపీ నేతలే షాక్ అవుతున్నారు. జగనన్న అంటూనే సీఎం జగన్ను టార్గెట్ చేస్తూ అధికార వైసీపీపైన ఆమె విమర్శనాస్త్రాలు సంధించడంతో మిగిలిన నేతలు కూడా షర్మిలపై నమ్మకాన్ని పెంచుకున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు షర్మిల జగన్ వదిలిన బాణం కాదని..చంద్రబాబు వదిలిన బాణం అని, ప్యాకేజీ తీసుకొని ఇలా స్క్రిప్ట్ చదువుతున్నారని షర్మిలను టార్గెట్ చేస్తున్న వైసీపీ లీడర్లకు దీటుగా సమాధానం చెబుతున్నారు. జగన్ కోసం గతంలో తిరిగిన షర్మిల ఇప్పుడు.. జగన్ పరిపాలనలో లోటుపాట్లను హైలెట్ చేస్తూ జనాల్లోకి దూసుకువెళుతుండటం కాంగ్రెస్ పుంజుకోవడానికి కారణం అని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో షర్మిల ఎక్కడికి వెళితే, అక్కడ వైఎస్ఆర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తానికి షర్మిల రాకతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తెచ్చుకుంటోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు ఇప్పుడు వెల్లువెత్తుతున్న దరఖాస్తుల సంఖ్య చూశాక, కాంగ్రెస్ నుంచి పోటీకి ఎవరూ ముందుకు రారన్న వైసీపీ లీడర్ల నోటికి తాళం పడినట్లే అవుతుందని చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ