ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం రాజ్భవన్లో ఆయనతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయించారు. ఇక ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇంకా హైకోర్టు న్యాయమూర్తులు, గవర్నర్ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మరియు సంయుక్త కార్యదర్శి పిఎస్ సూర్య ప్రకాష్ సహా రాష్ట్ర ముఖ్య కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. వీరితో పాటుగా పోలీసు శాఖకు చెందిన మరియు ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్భవన్లో అధికారికంగా హై-టీ కార్యక్రమం నిర్వహించారు.
కాగా కర్ణాటకకు చెందిన జస్టిస్ అబ్దుల్ నజీర్.. అంతకుముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. ఈ క్రమంలో ఆయన ట్రిపుల్ తలాక్, బాబ్రీ మసీదు వివాదం, నోట్ల రద్దు వంటి కీలక కేసుల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో సభ్యుడిగా ఉండటం విశేషం. కాగా 1983లో లా డిగ్రీ అందుకున్న తర్వాత న్యాయవాద వృత్తిలో ప్రవేశించిన జస్టిస్ నజీర్ 2003-2017 మధ్య కాలంలో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా మరియు న్యాయమూర్తిగా పనిచేశారు. అనంతరం 2017లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది గత నెల జనవరిలో పదవీ విరమణ చేశారు. ఇక ఇదిలా ఉండగా మరోవైపు ఇటీవలి వరకూ ఏపీ గవర్నర్గా సేవలందించిన బిశ్వభూషణ్ హరిచందన్ను కేంద్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE