దేశీయ ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ భారీ పెట్టుబడులు పెట్టింది. జియోలో 9.9 శాతం వాటాను ఫేస్బుక్ కొనుగోలు చేసింది. ఈ మేరకు 5.7 బిలయన్ డాలర్లు (రూ. 43,574 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు ఏప్రిల్ 22, బుధవారం నాడు ఫేస్బుక్ ప్రకటించింది. అలాగే ఈ భాగస్వామ్యంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ,ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ వేరువేరుగా ప్రకటనలు విడుదల చేసి ధృవీకరించారు. తాజా 9.9 శాతం వాటా కొనుగోలు చేయడంతో జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాను ఫేస్బుక్ సొంతం చేసుకుంది.
దేశంలోని టెక్నాలజీ రంగంలో జరిగిన అతిపెద్ద ఎఫ్డీఐ ఇదేనని రిలయన్స్ ప్రకటించింది. ఫేస్బుక్ పెట్టుబడుల అనంతరం జియో ప్లాట్ ఫామ్స్ యొక్క విలువ రూ.4.62 లక్షల కోట్లకు పెరిగినట్లుగా తెలుస్తుంది. ఫేస్బుక్ కు చెందిన వాట్సాప్ కు దేశంలో 400 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్ భారత్లో డిజిటల్ చెల్లింపులకు అనుమతి పొందినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ భాగస్వామ్యంతో ఫేస్బుక్ తన పరిధిని మరింత విస్తరించుకోనుంది. జియోలో పెట్టుబడులు పెట్టడంపై ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ స్పందిస్తూ, “భారత్లో ప్రజలకు వాణిజ్యపరంగా మరిన్ని అవకాశాలు కల్పించేలా రిలయన్స్ జియోతో కలిసి పనిచేయబోతున్నాం, ఈ బాగస్వామ్యానికి సహకరించిన ముఖేశ్ అంబానీ, జియో టీమ్కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని” పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu