విజయవాడ ఎంపీ కేశినేని నానికి సొంతింటి పోరు ఎక్కువయింది. సొంత తమ్ముడితోనే పొలిటికల్ తంటాలు వచ్చి పడ్డాయి. త్వరలో ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు కాకుండా తమ్ముడి చిన్నికి సీటు ఖరారు చేయడంతో అటు టీడీపీ అధిష్టానాన్ని, ఇటు తమ్ముడిని తనదైన శైలిలో మాటల దాడికి దిగుతున్నారు. తమ నాయకుడి నిర్ణయమే శిరోధార్యం అంటూనే మరోవైపు విమర్శల దాడికి దిగుతున్నారు. అంతేకాదు అధినేత ఒప్పుకున్నా లేకపోయినా మళ్లీ పోటీ చేస్తానని కూడా హెచ్చరిస్తున్నారు. విజయవాడ ఎంపీగా హ్యాట్రిక్ సాధించి ఢిల్లీకి వెళ్తానంటూ సొంత పార్టీ వర్గాల దగ్గరే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కేశినేని నాని విజయవాడ ఎంపీగా రెండు సార్లు గెలిచారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర వేవ్ను కూడా తట్టుకుని 2019లో రెండోసారి కూడా ఎంపీగా గెలిచారు. విజయవాడలో తాను చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు గెలిపించారని తరచూ చెప్పే నాని.. తన ఊపిరి ఉన్నంతవరకు సేవ చేసుకుంటానని చెబుతూనే ఉండేవారు. ఆ తర్వాత కారణం ఏదైనా కానీ క్రమంగా పార్టీలో నానికి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. దీంతోనే 2024 ఎన్నికల్లో కేశినేని నానికి బదులు ఆయన తమ్ముడు కేశినేని చిన్నిని రంగంలోకి దింపాలని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు ..చిన్నికి సీటు ఖరారు చేస్తూ ప్రకటన కూడా చేశారు.
దీంతో అప్పటి వరకూ కనిపించని మార్పు నానిలో కనిపించింది. నిజానికి దీనికంటే ముందు తమ్ముడికి టికెట్ ఇస్తారని అంచనాలు వేసిన కేశినేని నాని ..చిన్నగా చంద్రబాబుపై విమర్శలు చేయడం.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం ప్రారంభించారు. అంతటితో ఊరుకోకుండా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన కొన్ని ముఖ్యమైన వైసీపీ కార్యక్రమాలకు కూడా నాని హాజరయ్యారు. అక్కడ హాట్ కామెంట్స్ చేసి టీడీపీలో సెగలు పుట్టించారు. అలా కొద్ది రోజులు గడిచి తర్వాత మళ్లీ ఏమయిందో కానీ తిరిగి తెలుగుదేశంలో యాక్టివ్ అయ్యారు. టీడీపీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనడమే కాకుండా.. అటు అధినేత చంద్రబాబు కార్యక్రమాల్లో కూడా ఆయన వెంట నడిచారు. ఇక చంద్రబాబు ఎలా చెబితే అలా నడుకుంటారనే నమ్మకాన్ని కూడా కలిగించారు.
కానీ జనవరి 3న జరిగిన టీడీపీ కార్యక్రమంలో.. కేశినేని నాని, కేశినాని చిన్ని మధ్య వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. నాని వర్గం, చిన్ని వర్గం పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో స్థానిక పోలీసులకు కూడా గాయాలవడంతో అధిష్టానం స్పందించింది. కేశినేని చిన్నికి విజయవాడ పార్లమెంట్ బాధ్యతలను అప్పగించినట్లు వెంటనే ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో బాగా హర్ట్ అయిన కేశినేని నాని మళ్లీ మాటల యుద్ధం మొదలు పెట్టి.. తనదైన శైల్లో విమర్శల దాడికి దిగారు. చంద్రబాబు నిర్ణయం శిరోదార్యమంటూనే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
అధినేత చంద్రబాబు తనను వద్దని అనుకున్నారని, కానీ తాను మాత్రం అనుకోలేదని కేశినేని నాని సెంటిమెంట్ డైలాగులు పండించారు. అలా అని అక్కడితే ఊరుకుంటే కేశినేని నాని ఎందుకవుతారని అనుకున్నారో ఏమో కానీ.. బెజవాడ ప్రజలకు తనపై నమ్మకం ఉందని, ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుస్తాననే ధీమాను వ్యక్తం చేశారు. తానేం చేయాలి అనేది కాలమే నిర్ణయిస్తుందని, కానీ ఖాళీగా ఉంటే అభిమానులు, కార్యకర్తలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు.
తాను చంద్రబాబుకు వెన్ను పోటు పొడవలేదని.. పొడిచి ఉంటే మంచి పదవిలో ఉండేవాడినని కేశినేని నాని సున్నితంగానే సెటైర్లు వేశారు. మూడోసారి విజయవాడ ఎంపీగా హ్యాట్రిక్ సాధిస్తానని.. ఢిల్లీ కూడా వెళ్తానని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు ఢిల్లీ వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకపోతే ఇంకోకటి చూసుకోవాలని ఇన్ డైరక్ట్గా పార్టీ మారతానని నాని చెప్పుకొచ్చారు. తాజాగా నాని చెప్పిన దానిని బట్టి కచ్చితంగా విజయవాడ ఎంపీగా పోటీ చేయడం గ్యారంటీ అని కాకపోతే టీడీపీ ఫ్లైట్ కాదంటే వైసీపీ జెట్ ద్వారా ఢిల్లీ వెళ్తారేమోనని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE