ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. తాజాగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 143 కి పెరిగినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పాటుగా పలు చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్షలు నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వ చేపడుతున్న చర్యలకు మద్దతుగా పలువురు ప్రముఖులు, సంస్థలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం సహాయ నిధికి కియా మోటార్స్ రూ.2 కోట్ల విరాళం ప్రకటించింది. కియా మోటార్స్ ఇండియా ఎండీ కుక్ హయాన్ షిమ్ ఏప్రిల్ 2, గురువారం నాడు సీఎం వైఎస్ జగన్ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలుసుకుని విరాళాలకు సంబంధించిన పత్రాలను అందజేశారు. అలాగే చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ సంస్థ కూడా ఏపీ సీఎం సహాయ నిధికి రూ.2 కోట్ల విరాళం ప్రకటించింది. శ్రీ సిటీ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సన్నారెడ్డి రవీంద్ర ఈ రోజు సీఎం వైఎస్ జగన్ను కలుసుకుని విరాళానికి సంబంధించిన చెక్ను అందజేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా వారి మూడు రోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సీనియర్ ఐఏఎస్ అధికారులు నీరబ్ కుమార్ ప్రసాద్, విజయకుమార్, ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్కుమార్, తదితరులు సీఎం వైఎస్ జగన్ను కలుసుకుని విరాళాలకు సంబంధించిన పత్రాలు అందజేశారు.
[subscribe]