ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ఎంపిక చేశామని, దీనికి నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా సమ్మతం తెలిపారని చెప్పారు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు. బుధవారం ఆయన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా విశాఖ నగరం పెందుర్తిలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం జంక్షన్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిని ఏపీ రాజధానిగా, విశాఖను ఆర్థిక, ఐటీ రాజధానిగా, టూరిజం హబ్గా డెవలప్ చేయాలని భావించామని, అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో చివరకు రాష్ట్రానికి రాజధాని అనేదే లేకుండా పోయిందని మండిపడ్డారు. నాడు అమరావతికి మద్దతు తెలిపి, ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పారని, కానీ చివరకు ఈ ప్రాంతాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్కు ఉన్నట్లు అమరావతి, హైదరాబాద్, ఇడుపులపాయ, కడప, పులివెందుల, బెంగళూరు, చెన్నైలలో తనకు ప్యాలెస్లు లేవని, తాను ఉండవల్లిలో అద్దె ఇంట్లో ఉంటున్నానని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు నేను ఉంటున్న ఇంటికి అద్దె కడుతున్నానని చెబుతున్నప్పటికీ క్విడ్ ప్రో కో జరిగిందంటున్నారని, రింగురోడ్డు పేరుతో కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్లకోసం 5 శాతం భూమిని రిజర్వు చేశామని, కానీ ఇప్పుడు ఒకేచోట వెయ్యి ఎకరాల్లో సెంటు భూమి చొప్పున ఇస్తానంటూ సీఎం జగన్ పేదలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికలప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్టులో కోడి కత్తి దాడి ఘటన, బాబాయి వివేకానంద రెడ్డి హత్యను తనపైకి నెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందారని, ఇప్పుడు ఆ కేసుల నుంచి బయటపడేందుకు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ వధ చేసి, మళ్లీ గౌరవంగా అసెంబ్లీలో అడుగుపెడతానని చంద్రబాబు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE