ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 కార్పొరేషన్స్, 73 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. అలాగే తెలుగుదేశం పార్టీ కేవలం తాడిపత్రి, మైదుకూరు మున్సిపాలిటీల్లోనే అత్యధిక వార్డులు గెలుచుకోగలిగింది. ఈ నేపథ్యంలో నేడు (మార్చి 18, గురువారం) కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక, మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరగనుంది. మైదుకూరులో టీడీపీ 12, వైఎస్సార్సీపీ 11, జనసేన ఒక వార్డు గెలుచుకోగా, ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లతో చైర్ పర్సన్ పదవిని వైఎస్సార్సీపీ దక్కించుకునే అవకాశం ఉంది. అయితే తాడిపత్రి ఛైర్మన్ పీఠం విషయంలో ఉత్కంఠ నెలకుంది. తాడిపత్రిలో మొత్తం 36 వార్డుల్లో టీడీపీ 18, వైఎస్సార్సీపీ 16, సీపీఐ 1, ఇతరులు 1 గెలుచుకున్నారు. టీడీపీకి ఆధిక్యం రావడంతో చైర్మన్ పీఠం కోసం రంగం సిద్ధం చేస్తోంది. అటు వైఎస్సార్సీపీ కూడా ఛైర్మన్ పదవి రేసులో ఉండడంతో తాడిపత్రిలో రాజకీయాలు వేడెక్కాయి.
మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తాడిపత్రిలో ఉత్కంఠ పరిస్థితి నెలకుంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి క్యాంప్లో సీపీఐ, ఇండిపెండెంట్లు కలిపి 20 మంది అభ్యర్థులు ఉన్నారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. ముందుగా ఎక్స్ అఫీషియో ఓటర్లుగా నమోదు చేసుకున్నవారికి మున్సిపల్ కమిషనర్ షాకిచ్చారు. ఎక్స్ అఫీషియో ఓటు కోసం టీడీపీతో పాటు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా దరఖాస్తు చేసుకోగా, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి తిరస్కరించారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా కేవలం ఎంపీ, ఎమ్మెల్యేలకు మాత్రమే అర్హత ఉంటుందని స్పష్టం చేశారు. తాడిపత్రిలో మొత్తం 36 వార్డులు ఉండగా టీడీపీ 18, వైస్సార్సీపీ 16 సీట్లు గెలుచుకుంది. ఎక్స్ అఫీషియో ఓట్ల సాయంతో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ వైఎస్సార్సీపీ చెందిన వారే కాబట్టి రెండు పార్టీలకు సమాన ఓట్లు పడే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఛైర్మన్ ఎన్నికలో ఏమి జరగబోతున్నదని ప్రజల్లో ఆసక్తి నెలకుంది.
మరోవైపు తాడిపత్రి డిఎస్పి చైతన్య మీడియాతో మాట్లాడుతూ, మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో 15 మంది సీఐలు డాగ్ స్క్వాడ్ బృందం ప్రధాన గేటు వద్ద డీఫ్ఎండిలతో తనిఖీలు చేపడతామన్నారు. కిలోమీటర్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తామన్నారు. కార్యాలయం చుట్టుపక్కల ఉన్నవారు కొత్తవారిని అనుమతించరాదన్నారు. చుట్టూ ప్రక్కన ఉన్న మండలాల వారిని పట్టణంలోకి అనుమతించమన్నారు. ఘర్షణలకు పాల్పడే వారిని ఉపేక్షించమని చెప్పారు. పట్టణంలో 144 సెక్షన్,30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉన్నందున ప్రజలు గుంపులు గుంపులుగా ఉండరాదన్నారు. కౌన్సిల్ సమావేశం సజావుగా జరిగేందుకు సభ్యులు సహకరించాలని కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ