కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండి, వారి కన్నీరు తుడవడమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి జనసేన పార్టీ అహర్నిశలు కృషి చేస్తోందని అన్నారు. కరోనా మహమ్మారి బారినపడి అసువులు బాసిన వారికి బుధవారం మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి పుష్పాంజలి ఘటించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “కరోనా మహమ్మారి బారిన పడి దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 7 వేల మంది మృతి చెందారు. ఇవి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు. లెక్కలోకి రాని మరణాలు ఇంకా చాలా ఉన్నాయన్న సంగతి మనందరికి తెలిసిందే. ఈ కష్టకాలంలో చాలా మంది జనసైనికులు, వారి కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవడం కలిచివేసింది. వ్యక్తిగతంగా కూడా చాలా మంది సన్నిహితులను కోల్పోయాను. కోవిడ్ విపత్తు సమయంలో కష్టనష్టాలకు ఓర్చి, ప్రజలు ధైర్యంగా ఎదుర్కొవడం కొండంతా మనోబలాన్ని ఇచ్చింది. కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రాణాలను పణంగా పెట్టి జనసైనికులు అందించిన సాయం వెలకట్టలేనిది. మునుముందు కూడా ఇలా కార్యక్రమాలు కొనసాగిద్దాం. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సాయమందిస్తున్న జనసైనికులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో నా వ్యక్తిగత సంపాదన నుంచి కోటి రూపాయలను ఇన్సురెన్స్ పథకానికి ఇచ్చాను” చెప్పారు.
అలాగే ఈ సందర్భంగా జనసైనికుడి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించారు. జనసేన పార్టీ కోసం నిస్వార్ధంగా పని చేసిన నంద్యాలకు చెందిన జనసైనికుడు ఆకుల సోమశేఖర్ ఇటీవల దురదృష్టవశాత్తు మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. సోమశేఖర్ భార్య సంధ్యకు జనసేన పార్టీ ప్రవేశపెట్టిన కీయాశీలక సభ్యత్వం ప్రమాద బీమా పథకం నుంచి రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందించారు. ఆ కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ