ఆర్మీ జవాన్ సాయితేజ పిల్లలకు ఉచిత విద్య అందిస్తాం అని “మా” అధ్యక్షుడు మంచు విష్ణు చెప్పారు. నిన్న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాల చీఫ్ బిపిన్ రావత్ తో పాటుగా మరో 12 మంది మరణించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ సాయితేజ (27) కూడా అసువులు బాసారు. 2013 లో సాధారణ ఆర్మీ డ్రైవర్ గా ఉద్యోగంలో చేరిన సాయితేజ, బిపిన్ రావత్ లాంటి అధికారికి సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసే స్థాయికి ఎదగటంలో అతను చూపిన ప్రతిభ అనన్యసామాన్యం. డ్యూటీలో ఎంతో సిన్సియర్ గా ఉండే అతడిని పై అధికారులు మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి సాయితేజ ఇప్పుడు ఇలా ప్రమాదంలో అకస్మాత్తుగా మరణించటం అతని కుటుంబాన్ని తీరని శోకానికి గురిచేసింది.
సాయితేజ కి భార్య శ్యామల, కొడుకు మోక్ష (5), కూతురు దర్శిని (2) ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన స్థితిలో వీరికి సహాయం చేయటానికి “మా” అధ్యక్షుడు మంచు విష్ణు ముందుకొచ్చారు. ఫోన్ చేసి సాయితేజ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాను త్వరలోనే తిరుపతి వస్తానని, వారిని తప్పక కలుస్తానని చెప్పారు. సాయితేజ పిల్లలను ఇంజినీరింగ్ వరకు చదివిస్తానని హామీ ఇచ్చారు. తమ విద్యాసంస్థలలో వారికి ఉచిత విద్యను అందిస్తానని తెలిపారు. ఈ విషయమై మంచు కుటుంబానికి చెందిన శ్రీ విద్యానికేతన్ ప్రతినిధులు జవాన్ సాయితేజ కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ