అభివృద్ది, సంక్షేమ పథకాల్లో దేశానికే దిక్సూచిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం, హరితనిధి ఏర్పాటుతో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. రాష్ట్రం పచ్చబడాలనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంకల్పంతో దేశంలోనే తొలిసారిగా హరితనిధి ఏర్పాటైందని అన్నారు. హరితనిధి విధివిధానాలు, విరాళాల జమపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సోమవారం అసెంబ్లీ కమీటీ హాల్ లో రాష్ట్ర మంత్రుల సమీక్షా సమావేశం జరిగింది. ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుతో పాటు, అటవీ పర్యావణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
హరిత తెలంగాణ సాధనలో సమాజంలో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం విరాళాల రూపంలో ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నిధి ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, ఏప్రిల్ నెల జీతాల నుంచి ఈ విరాళాల జమ ప్రక్రియ ప్రారంభమౌతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇందుకోసం సంబంధిత శాఖలు అంతర్గత ఉత్తర్వుల ద్వారా పనిని ప్రారంభించాలని, అలాగే తెలంగాణకు హరితహారం, హరితనిధి ఉద్దేశ్యాలను అందరికీ అర్థమయ్యేలా వివరించాలని కోరారు. ఇప్పటికే ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కంపెనీలు, షాపులు, వివిధ ఎస్టాబ్లిష్ మెంట్ల నుంచి తగిన మొత్తం హరితనిధికి జమ అయ్యేలా చూడాలని మంత్రులు ఆదేశించారు. అడవుల పరిరక్షణ, పచ్చదనం పెంచడంలో దేశంలోనే తెలంగాణ మిగితా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని, ఏప్రిల్ 1 నుంచి హరిత నిధి అమలులోకి వచ్చి, మే నెల జీతాలతో నిధుల జమ ప్రారంభమౌతుందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హరిత నిధి ద్వారా సమాజంలోనూ, పౌరుల్లోనూ పచ్చదనంపై బాధ్యత మరింత పెరుగుతుందని, జమ అయ్యే నిధితో నర్సరీల్లో మొక్కల పెంపకం, పచ్చదనం పెంపుకు ఎంతగానో దోహదపడుతుందని పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ