ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రాజధానుల అంశం కాక రేపుతోంది. ఒకవైపు ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు శ్రీకాకుళం వరకు ‘మహా పాదయాత్ర’ చేస్తుండగా.. మరోవైపు ఏపీకి మూడు రాజధానులకు మద్దతుగా అధికార వైఎస్సార్సీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ హనుమంతు లజపతిరాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన జేఏసీ, అక్టోబర్ 15న విశాఖలో రాజధానికి మద్దతుగా నగరంలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ ‘విశాఖ గర్జన’ పోస్టర్ను విడుదల చేశారు. వైసీపీ శ్రేణులు, పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర ప్రజలు భారీగా పాల్గొని తమ మద్దతు తెలపాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు.
ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ గర్జనకు పిలుపునివ్వగానే పవన్ కల్యాణ్ నిద్రలేచారని, విశాఖ గర్జన రోజే మీటింగ్ పెట్టుకోవడం అవసరమా? అని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. అలాగే ఉత్తరాంధ్రకు అభివృద్ధికి ఉపయోగపడే రాజధానిని ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లను నిలదీశారు. అమరావతిలో ఉన్నవి 29 గ్రామాలేనని, ఉత్తరాంధ్రలో 6 వేల గ్రామాలు ఉన్నాయని తెలిపారు. ఉత్తరాంధ్ర రైతులు చాలా పేదవాళ్లని, రాజకీయాలు పక్కనబెట్టి ప్రజల కోసం నిలుద్దామని అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY