మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన చంద్రబాబు, ఏపీ రాజకీయాల్లో నిబద్దత కలిగిన నాయకుడని కన్నాపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడం శుభపరిణామమని, ఏపీ రాజకీయాల్లో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఇక కన్నా ప్రత్యేకమైన వ్యక్తి అని కితాబిచ్చిన చంద్రబాబు, రాష్ట్ర రాజకీయాల్లో ఆయనను విభిన్న పదవుల్లో చూశానని పేర్కొన్నారు. రాజకీయాల్లో హుందాతనం, పద్ధతి, నిబద్ధత కలిగిన వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ అని, సిద్ధాంతం కలిగిన రాజకీయ నాయకుల్లో ఆయన కూడా ఒకరని తెలిపారు. టీడీపీతోనే ఏపీ అభివృద్ధని భావించి కన్నా టీడీపీలోకి వచ్చారని, అలాగే అమరావతే రాజధానిగా ఉండాలని కన్నా లక్ష్మీనారాయణ భావిస్తున్నారని చెప్పారు.
ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో రివర్స్ పాలన కొనసాగుతోందని, రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని మండిపడ్డారు. అధికారంలోకి వస్తూనే జగన్ ప్రజావేదిక కూల్చివేశారని, అయితే అది తన ఆస్తి కాదని, ప్రజల ఆస్తి అని, ప్రజల డబ్బుతోనే ప్రజా వేదిక నిర్మించామని తెలిపారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయని, అలాగే విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏపీలో సంక్షేమ పథకాలు కొత్త కాదని, 40 ఏళ్ల క్రితమే ఎన్టీఆర్ పలు పథకాలు అమలుచేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ అధికారం చేపట్టిన ముఖ్యమంత్రులు అందరూ తమ శక్తి మేరకు రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారని, అయితే జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధి చెందకపోగా, రాష్ట్రం మరో ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్తోందని దుయ్యబట్టారు. ఇంగ్లీష్ చదువు కొత్తగా తెచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని, ఈ మూడున్నరేళ్లలో ఒక్కసారి కూడా డీఎస్సీ ప్రకటించలేదని, ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయలేదని విమర్శించారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పరాభవం తప్పదని, టీడీపీ ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE