ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం అక్టోబర్ 16, బుధవారం నాడు సమావేశమయింది. ఉదయం 11 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలపై చర్చించారు. అంతే కాకుండా కొత్త సంక్షేమ పథకాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు తెలియజేసారు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు:
- చేనేత కార్మికుల కోసం డిసెంబర్ 21వ తేదీన ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకం ప్రారంభం, ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబానికి రూ.24 వేలు అందజేత
- వేట నిషేధించిన సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం తరపున రూ.10వేలు ఆర్థిక సాయం, నవంబర్ 21 మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఈ పథకం ప్రారంభం
- మత్స్యకారుల బోట్లకు లీటర్ డీజిల్కు తొమ్మిది రూపాయల సబ్సిడీ ఇవ్వడం, డీజిల్ కొనుగోలు చేసే సమయంలోనే సబ్సిడీ వర్తింపు
- న్యాయవాదులకు రూ.5 వేల ప్రోత్సాహం, డిసెంబర్ 3న జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా అందిస్తారు
- హోంగార్డుల జీతాలను పెంపునకు ఆమోదం, వారీ రోజువారీ వేతనం రూ.600 నుంచి రూ.710కి పెంపు. దీంతో హోంగార్డుల నెల జీతం రూ.18వేల నుంచి రూ.21,300 పెరగనుంది
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల గౌరవవేతనం రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంపు
- రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా వాటర్ గ్రిడ్ ఏర్పాటు
- ఉద్దాన ప్రాంతంలో రూ.50 కోట్లతో సూపర్ స్పెషాలిటీ కిడ్నీ హాస్పిటల్ ఏర్పాటు
- రైతులకు ఉచిత బోర్లు వేసేందుకు 200 డ్రిల్లింగ్ యంత్రాల కొనుగోలుకు ఆమోదముద్ర
- ఏపీఎస్ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదముద్ర
- ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు.
[subscribe]