ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సోమవారం ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ అమలు అంశాన్ని ఈ లేఖలో ముద్రగడ ప్రస్తావించారు. “గతంలో కూడా నా (బలిజ, కాపు, తెలగ, ఒంటరి) జాతి పొగొట్టుకున్న రిజర్వేషన్ విషయమై లేఖ రాసానండి. మరలా ఈ రోజు వ్రాయడానికి గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈడబ్ల్యూఎస్ పై ఇచ్చిన తీర్చు, రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకి రాజ్యాంగం 103, 105 సవరణ చట్టం 2019 అండ్ 2021 అనుసరించి ఆర్టికల్ 342A(3) ప్రకారం రిజర్వేషను రాష్ట్రంలో అమలుచేసుకోవచ్చు అని సోషల్ జస్టిస్ మంత్రి ప్రతిమా భౌమిక్ 2022, డిసెంబర్ 21న సమాధానం ఇచ్చారండి. పై విషయాలు పరిశీలించి రిజర్వేషన్ ఇవ్వడానికి దృష్టి పెట్టవలసినదిగా కోరుకుంటున్నానండి. నేను అడిగింది ఎవరి కోటాలోను వాటా పెట్టమని అడగడం లేదండి. అందరూ అనుభవించగా మిగిలిన దానిలోనే ఇప్పించండి. 2019 అసెంబ్లీ ఎన్నికలలో కొద్దిపాటి నియోజకవర్గాలలో తప్ప మిగిలిన అన్ని చోట్ల మా కాపుజాతి వారందరూ మీ గెలుపుకు ఉపయోగపడినారండి. మీరు మా కాపుజాతికి రిజర్వేషను కల్పించి మరొక సారి మా కాపు జాతి మీ విజయానికి ఉపయోగపడేలా చూసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నానండి” అని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.
“తమరు ఎన్నో కులాల వారికి వారి అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు దానం చేస్తూ వారి జీవితాలలో వెలుగు చూస్తావున్నారండి. అలాగే మా కాపు జాతి వారికి అటువంటి వెలుగు చూపించమని కోరుచున్నానండి. నేను పుట్టిన ఊరి కోసం, నాకు రాజకీయ భిక్ష పెట్టిన ప్రజల కోసం, ఆఖరిగా నేను పుట్టిన కులం కోసం, అవకాశం ఉన్నంత వరకు ఇతరులకు నష్టం లేకుండా సహాయపడాలనే తపన తప్ప మిమ్మలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కాదండి. తలపెట్టిన పని కోసం నిత్యం తాపత్రయపడే వాడిని నేనండి. ఎన్.టి. రామారావును, మీ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రజలు దేవుడులాగా భావించారండి. పేద వర్గాలకు మంచి చేసి మీరు కూడా ప్రజలచే ప్రేమించబడడానికి పునాదులు వేసుకోమని కోరుచున్నానండి. దయచేసి మనస్సు పెట్టి రిజర్వేషను కల్పించుటకు ఆలోచన చేసి మా పేద కాపులకు న్యాయం చేయమని తమరిని కోరుచున్నానండి” అని సీఎం వైఎస్ జగన్ కు రాసిన లేఖలో ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE