ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా పొత్తులపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసినా వచ్చే ఎన్నికల కోసం ఏ పార్టీ.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందన్న మాటలే వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఏపీ సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కూడా ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరిపేసరికి ఈ చర్చలు మరింత జోరందుకున్నాయి. టీడీపీ,జనసేన కూటమిలో ఇప్పటికే కొన్ని సీట్లు ఖరారు కావడంతో మిగిలిన సీట్ల సర్ధుబాటుకోసం ఇద్దరు తరచూ సమావేశం అవుతున్నారు. ఇప్పుడు ఈ కూటమికి బీజేపీ కూడా తోడవుతుందా అన్నట్లుగా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇదే సమయంలో పొత్తులపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఓ కీలక ప్రకటన రిలీజ్ చేశారు. జన హితానికి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికే తమ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని జనసేన పార్టీ అధినేత స్పష్టం చేశారు. విస్తృతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. ఏపీ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగానే తాము ముందుకు వెళుతున్నామని పవన్ చెప్పారు. ప్రస్తుతం పొత్తులకు సంబంధించిన చర్చలు, చర్యలు కొనసాగుతున్న ఈ సమయంలో..పార్టీ నాయకులవెలవరూ భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దని కోరారు.
పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలను కూడా ప్రచారం చేయవద్దని జనసేన అధినేత సూచించారు. ఇటువంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించిన వారవుతారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన తమతమ అభిప్రాయాలతో పాటు సందేహాలు ఏమైనా ఉంటే తన రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ దృష్టికి తీసుకురావచ్చని పవన్ చెప్పారు. దీనివల్ల పార్టీలో నేతల ఆలోచనలు, భావోద్వేగాలు జనసేనకి చేరుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
పొత్తులపై జనసేన పార్టీ విధానాలకు భిన్నంగా ప్రకటనలు చేసే నాయకుల నుంచి.. ఇకపై వివరణ తీసుకోవలసిందిగా ఇప్పటికే జనసేన కేంద్ర కార్యాలయానికి ఆదేశాలు ఇచ్చామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా కూడా వారిని ప్రజలు గమనిస్తారని.. ఏపీ ప్రజలంతా ఇప్పుడు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ సమయంలో జనసేన పార్టీ శ్రేణులంతా మరింత అప్రమత్తంగా ఉండడం తప్పనిసరి అని పవన్ కళ్యాణ్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY