ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అప్రమత్తమైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. పెద్ద ఎత్తున సిట్టింగ్లను మార్చేస్తున్నారు. ప్రజాబలం తగ్గిన వారిని, పనితీరు బాగోలేని వారిని పక్కకు పెట్టేస్తున్నారు. వారి స్థానంలో కొత్త ముఖాలను తెరపైకి తీసుకొస్తున్నారు. ఈక్రమంలోనే కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా సైడ్ చేశారని కొద్దిరోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారని.. అదే సమయంలో మహీధర్ రెడ్డి తెలుగు దేశం పార్టీలోకి జంప్ కాబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కందుకూరి నుంచి బరిలోకి దించేందుకు కొత్త పేర్లను పరిశీలిస్తున్నారట. నలుగురైదుగురి పేర్లను పరిశీలించి చివరికి.. ఓ మహిళను కందుకూరి అభ్యర్థిగా జగన్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ అధిపతి డాక్టర్ వి. పెంచలయ్య కూతురు ఐశ్యర్యను కందుకూరి అభ్యర్థిగా జగన్ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే పెంచలయ్య వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్లి అధినేత జగన్ సమక్షంలో పెంచలయ్య వైసీపీ కండువా కప్పుకున్నారు. అదే సమయంలో తన కుమార్తెలు ఐశ్వర్య, అరవిందలు కూడా వైసీపీలో చేరారు.
అయితే మహీధర్ రెడ్డిని సైడ్ చేస్తారని ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి పెంచలయ్య రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. కందుకూరి టికెట్పై కన్నేశారు. తనకు కూతురు ఐశ్వర్యకు ఆ టికెట్ ఇప్పించుకునేందుకు పెంచలయ్య తన అనుచరుల ద్వారా విశ్వ ప్రయత్నాలు చేశారట. ఇటీవల జగన్తో సమావేశమయినప్పుడు కూడా టికెట్ విషయంపై చర్చలు జరిపారట. జగన్ నుంచి టికెట్ హామీ పొందినాకే వారు వైసీపీలో చేరేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. అటు పెంచలయ్య కుటుంబం ఆర్థికంగా బలంగా ఉండడం, పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుండడం, జనాల్లో కూడా మంచి పేరు ఉండడంతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో.. జగన్ వారి వైపు మొగ్గు చూపారట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ