ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఆర్థికపరమైన అండనివ్వాలని, నిరాశ్రయులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. “నివర్ తుపాన్ మూలంగా రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోవడం దురదృష్టకరం. క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న సమాచారం ప్రకారం చూస్తుంటే సుమారు రూ.వెయ్యి కోట్ల మేర పంట నష్టం కలిగినట్లు తెలిసింది. పంటలు చేతికి వచ్చే సమయంలో ప్రకృతి విపత్తుతో రైతాంగం దెబ్బతింది. నెల్లూరు, చిత్తూరు, కడప, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో రైతులకు ఏమీ మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితిలో రైతులను అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
“అప్పుల పాలైపోతున్న రైతులను మరింత కుంగదీసే విధంగా ఈ నష్టాలు ఉన్నాయి. కాబట్టి పెట్టుబడి రాయితీతోపాటు పంటల బీమాను సకాలంలో అందించడం చాలా అవసరం. గతేడాది ఖరీఫ్, రబీ పంటల నష్టానికి సంబంధించిన బీమా మొత్తాలు ఇప్పటికీ దెబ్బ తిన్న రైతులకు అందలేదు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ తగిన విధంగా స్పందించాలి. నివర్ తుపాన్ కంటే ముందు భారీ వర్షాలు, వరదల మూలంగా రైతాంగం నష్టపోయింది. ఇప్పుడు నివర్ మరింత దెబ్బ తీసింది. ప్రకృతి విపత్తుల వల్ల ఈ యేడాది పంటలు కోల్పోయిన రైతులకు అన్ని పంటలకూ విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందచేస్తే వ్యవసాయం చేసేవారికి ధీమా కలుగుతుంది. నివర్ తుపాన్ మూలంగా ఇళ్ళల్లోకి నీళ్ళు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. నిరాశ్రయులుగా మిగిలిన వారిని తక్షణమే ఆదుకొనే చర్యలను ప్రభుత్వం చేపట్టి బాధితులకు ఉపశమనం కలిగించాలి. కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనాతోపాటు ఇతర వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణ హెచ్చరికల ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లో మరో తుపాన్ పొంచి ఉందని తెలుస్తోంది. ప్రజలను ముందుగా అప్రమత్తం చేసే చర్యల్లో జనసైనికులు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ