పౌరోహిత్యంపై ఆధారపడ్డ బ్రాహ్మణులకు ఆర్థిక భరోసా ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన జనసేన పార్టీ తరుపున ప్రకటన విడుదల చేశారు. “కరోనా లాక్డౌన్ మూలంగా ఆర్థికంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న వారిలో పౌరోహిత్యంపైనే ఆధారపడ్డ బ్రాహ్మణ కుటుంబాలు వేలల్లో ఉన్నాయి. వివాహాలు, గృహ ప్రవేశాల ముహూర్తాలు ఉన్న సమయంలోనే లాక్డౌన్ రావడంతో పురోహితుల ఉపాధి దెబ్బ తిని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతరత్రా శుభకార్యాలు కావచ్చు, కర్మకాండలు చేయించే అవకాశాలు కూడా వారికి లేకుండాపోయాయి. పౌరోహిత్యంపై ఆధారపడ్డవారు ఎదుర్కొంటున్న కష్టాలను ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సవివరంగా తెలియచేసింది. ఈ నెల 24వ తేదీ తరవాత కొన్ని నెలలపాటు ముహూర్తాలు కూడా లేకపోవడం వల్ల పురోహితుల జీవనం మరింత గడ్డుగా మారుతుందని సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ తేజోమూర్తుల లక్ష్మీ నరసింహమూర్తి తెలిపారు. తమకు ఈ ఆపత్కాలంలో నెలకు కనీసం రూ.5 వేలు సహాయం, నిత్యావసరాలు అందించాలని కోరుతున్నారు. వారి విన్నపం సమంజసంగానే ఉంది. పౌరోహిత్యంపై ఆధారపడిన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఈ యేడాది బడ్జెట్ లో బ్రాహ్మణ కార్పొరేషన్ కి కేటాయించిన రూ.100 కోట్లను ఎటూ మళ్లించకుండా సక్రమంగా వినియోగించాలి. పేద బ్రాహ్మణ విద్యార్థులకు, పేద కుటుంబాలకు సకాలంలో విడుదల చేస్తేనే ప్రయోజనం చేకూరుతుందని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu