పంచభూతాలను కాపాడుకుందామని, పర్యావరణ పరిరక్షణ జనసేన మూల సిద్ధాంతమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నేడు పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ ప్రేమికులందరికీ పవన్ కళ్యాణ్ శుభాభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
“మానవజాతి సౌభాగ్యానికి పర్యావరణమే మూలం. మానవ మనుగడకు ఆధారం పంచభూతాలు. నింగి, నీరు, నేల, నిప్పు, గాలితో సమ్మిళితమైన పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే మానవజాతి శోభిల్లుతుంది. మన ఆరోగ్యం పర్యావరణంతోనే ముడిపడి వుంది. చక్కటి పర్యావరణం వున్న చోట ఆస్పత్రుల అవసరమే ఉండదంటారు నిపుణులు. జనసేన మూల సిద్ధాంతాలలో పర్యావరణానికి సముచిత స్థానం కల్పించిన సంగతి మీకు తెలిసిందే. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానాన్ని జనసేన కాంక్షిస్తోంది. అందులో భాగంగానే “మన నది- మన నుడి” కార్యక్రమాన్ని చేపట్టిందని” పవన్ కళ్యాణ్ అన్నారు.
“ఈ రోజున (జూన్ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాము. ఈ ఏడాదిలో పర్యావరణాన్ని పరిరక్షించుకోడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించుకోవలసిన రోజు ఇది. ప్రస్తుత పరిస్థితులు చక్కబడగానే “మన నది- మన నుడి” కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో ముందుకు తీసుకెళతాము. పర్యావరణానికి హితమైన మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను అమలుచేస్తాము. పర్యావరణాన్ని విషతుల్యం చేసే పరిశ్రమలపై నిరసన గళం వినిపిస్తూనే ఉంటాము. మనకు ఆరోగ్య ప్రదాయని అయిన పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు పరిరక్షించాలని కోరుతున్నాను. మన అడవులు, కొండలు, నదులను మనమే కాపాడుకోవాలి. పర్యావరణం మనకు కంటికి కనిపించని విలువైన సంపద. ఈ సంపదను మన భావితరాలకు అందించాలి. వారికి ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu