ఏపీలో ఆదివారం నాడు పరిషత్ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన జనసేన అభ్యర్థులకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 8వ తేదీన జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్ధులందరూ బలమైన పోరాటం చేశారు. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన ఫలితాల మేరకు 177 ఎంపీటీసీ, 2 జెడ్పీటీసీ స్థానాలను జనసేన అభ్యర్ధులు గెలుచుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ తరఫున విజయం సాధించిన అభ్యర్థులందరికీ జనసేన తరఫున, జనసైనికుల తరఫున, నాయకులందరి తరఫున హృదయపూర్వక అభినందనలు. ఈ ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయి, ఏ నేపధ్యంలో జరిగాయి అన్న అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా దగ్గర ఉంది. మరింత సమాచారం రావాల్సి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ఫలితాలపై రెండు మూడు రోజుల్లో సంపూర్ణ విశ్లేషణతో స్పందిస్తాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ