టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేన అధినేత 24 సీట్లకు ఒప్పుకుంటేనే అటు జనసేన, ఇటు ఏపీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక కాపు సంఘాల మాట సరేసరి. తాజాగా ఈ రెండు పార్టీల మధ్య బీజేపీ రావడంతో జనసేన స్థానాలు 21 కి తగ్గడంతో జనసేన పార్టీలో తీవ్ర అసంతృప్తి చెలరేగుతోంది. అసలు పవన్ ఏ ఉద్దేశంతో ఈ ఎన్నికలలో ముందుకు వెళుతున్నారంటూ సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీలో పొత్తుపెట్టుకున్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు.. సోమవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు 8 గంటలపాటు కూటమి సమావేశం కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు , కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ నేత బైజయంత్ పాండా సీట్ల పంపకాలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే సుదీర్ఘంగా జరిగిన మూడు పార్టీల కీలక నేతల భేటీలో సీట్ల సర్దుబాటు అంశం ఓ కొలిక్కి వచ్చింది. అయితే ఈ సీట్ల పంపకాల్లో మరోసారి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తగ్గి పార్టీతో సర్ధుకుపోవడం హాట్ టాపిక్ అయింది. పవన్ 3 అసెంబ్లీ సీట్లు తగ్గించుకోగా, టీడీపీ ఒక సీటును కమలం పార్టీకి ఇచ్చింది.
టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్ధానాలను చంద్రబాబు ఇచ్చారు .అయితే ఇందులో జనసేన పార్టీ కేవలం 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతుండగా.. బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది. మొదట టీడీపీ,జనసేన పొత్తులో.. జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు దక్కగా..ఇప్పుడు కూటమిలో బీజేపీ యాడ్ అవడంతో.. మూడు సీట్లను తగ్గించుకుని 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ అంగీకరించారు.టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది.
కేవలం వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదంటూ పదే పదే చెబుతూ వస్తున్న పవన్..ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కూడా అదే కారణం ఉన్నట్లు తెలుస్తోంది. భేటీ ప్రారంభం నుంచీ డబుల్ డిజిట్ కావాలని కమలం పార్టీ పట్టుబట్టడంతో బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలను ఇవ్వడానికి పవన్ 3 సీట్లను వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పటికే జనసేన నిర్ణయంపై మండిపడుతున్న కాపు సంఘాల నేతలు, జనసేన వర్గాలు..పవన్ తాజా నిర్ణయంతో మరింత అసంతృప్తికి లోనవడమే కాకుండా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తగ్గడం మంచిదే కానీ.. మరీ ఇంతలా తగ్గితే పార్టీకి మిగిలేదేముంది. దీనికోసం పదేళ్ల పాటు అష్టకష్టాలు పడటం ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
నెల్లిమర్ల, అనకాపల్లి, కాకినాడ రూరల్, రాజానగరం, రాజోలు, నిడదవోలు, తెనాలి స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మిగిలిన స్థానాల నుంచి ఎవరెక్కడ పోటీ చేస్తారనే దానిపై త్వరలోనే ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మార్చి 17న చిలకలూరిపేట బొప్పూడిలో టీడీపీ-బీజేపీ-జనసేన తొలి ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనుండగా ప్రధాని మోడీ ఈ సభకు హాజరుకానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE