తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రథం దగ్ధమైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరడాన్ని స్వాగతిస్తున్నామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ అంశంపై గురువారం నాడు ఆయన వరుస ట్వీట్స్ చేశారు. అంతర్వేది సంఘటనలో సీబీఐ దర్యాప్తుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరటం అంటే పరిష్కారం అయినట్టు కాదు, నిందితుల్ని పట్టుకోవటానికి వేసిన తొలి అడుగు మాత్రమే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తోందని అన్నారు.
“అంతర్వేది రథం దగ్ధం ఘటనకే సీబీఐ పరిమితం కారాదు. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం, కొండబిట్రగుంట రథం దగ్ధం వెనుక ఎవరు ఉన్నారో సీబీఐ నిగ్గు తేల్చాలి. ఈ మూడు దుశ్చర్యలూ ఒకేలా ఉన్నాయి. కాబట్టి పిఠాపురం, కొండ బిట్రగుంటల్లోని ఘటనల్నీ సీబీఐ పరిధిలోకి తీసుకువెళ్ళండి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న అంతర్వేది ఆలయ భూములు అన్యాక్రాంతమైపోయాయి. ఈ ఆలయమే కాదు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, ధర్మసత్రాల ఆస్తులు ఆన్యులపరమైపోయాయి. వీటి గురించీ సీబీఐ ఆరా తీసి ఎండోమెంట్స్ ఆస్తులకు రక్షణ ఇవ్వాలి. వీటితోపాటు తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ గురించీ సీబీఐ ఆరా తీయాలి. ఆ పింక్ డైమండ్ ఏమైపోయినదనే అంశంపై రమణ దీక్షితులు గత ప్రభుత్వ హయాంలోనే సంచలన విషయాలు చెప్పారు. ఆ వజ్రం ఎటుపోయిందో ఆరా తీయాలి. తిరుమల శ్రీవారికి శ్రీకృష్ణ దేవరాయలవారు ఇచ్చిన ఆభరణాల గురించీ ఆరా తీయాలి” అని పవన్ కళ్యాణ్ కోరారు.
“భవిష్యత్తులో ఏ మతస్తుల మనోభావాలు దెబ్బతినేలా దుశ్చర్యలు జరగకూడని జనసేన కోరుకుంటోంది. అంతర్వేదిలో అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. విచారణ విషయంలో ప్రభుత్వం ఆమోదకర చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో శుక్రవారం నాటి ‘ఛలో అంతర్వేది’ కార్యక్రమాన్ని విరమించుకుంటున్నాము. అయితే ధర్మ సంస్థాపనార్ధం తలపెట్టిన మహిళల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుంది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu