జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనవరి 11, శనివారం నాడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ముందుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో 13 జిల్లాల జనసేన నేతలలో జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. అయితే పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని పవన్ కళ్యాణ్ మధ్యలోనే ముగించారు. సమావేశం మధ్యలో ఉండగానే ఢిల్లీ పర్యటనకు సంబంధించిన సమాచారం అందడంతో హుటాహుటిన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలువురు ప్రముఖులతో అపాయింట్మెంట్ ఖరారవడంతోనే పవన్ ఢిల్లీకి వెళ్లినట్టుగా తెలుస్తుంది.
జనవరి 10న పార్టీ కార్యాలయంలో పవన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. విభజన చట్టం ప్రకారం రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉందని గుర్తుచేశారు. అలాగే కేంద్రం రాజధాని అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రాంత రైతులు 25 రోజులుగా చేస్తున్న ఆందోళనలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటుగా రాజధాని అంశంపై ప్రభుత్వ పెద్దలతో చర్చించేందుకే ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం. అయితే అక్కడ ఎవరెవర్ని కలవబోతున్నారనే విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
[subscribe]