తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండగ ఒట్టి పిండివంటలతోనే పూర్తి కాదు. కోడి పందేలు కూడా పండగలో ఒక భాగమే. ఆంధ్రాలో అయితే పందేలకోసం ఏకంగా బరులు ఏర్పాటు చేస్తారు. చుట్టూ వందలమంది చూస్తుండగా పుంజులు పందెంలోకి దిగుతాయి. రక్తమోడుతున్నా సరే వెనక్కి తగ్గవు. ఒక్కోసారి అది ఎదో ఒక పుంజు నెలకొరిగేవరకూ కొనసాగుతుంటుంది. అయితే, సంప్రదాయం పేరుతో కోడికి కత్తి కట్టి పందేలు నిర్వహిస్తే అడ్డుకుంటామని ఏపీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. జంతు హింస అరికట్టేందుకు గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది.
అయితే, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో నడిచే కోడి పందేలను అరికట్టడం పోలీసులకు తలకు మించిన భారమే. ఏటా, సంక్రాంతి పండగ వచ్చిందంటే చిత్తూరు జిల్లాలో జల్లికట్టు, కోస్తా జిల్లాల్లో కోడి పందేలపై వివాదం నెలకొంటుంది. దీనిపై జంతు ప్రేమికులు, పక్షి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే.. పోలీసుశాఖ రంగంలోకి దిగింది. క్షేత్ర స్థాయిలో కోడి పందేలు నిర్వహించే వారి జాబితా సేకరించాలని పోలీసు స్టేషన్ల ఎస్హెచ్వోలకు ఎస్పీలు ఆదేశాలిచ్చారు. గత ఐదేళ్లుగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో.. ఎక్కడెక్కడ కోడికి కత్తికట్టి పందేలు నిర్వహించారు? వాటి నిర్వాహకులు ఎవరు? అని సమాచారాన్ని సేకరించి బైండోవర్ చేయాలని ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ