ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు, రేపు (నవంబర్ 11, 12వ తేదీల్లో) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ విశాఖలో రూ.15233 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం మదురై విమానాశ్రయం నుంచి బయలుదేరి, రాత్రి 7.25 గంటల సమయంలో విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగకు చేరుకుంటారు. అనంతరం కంచర్లపాలెం, ఓల్డ్ ఐటీవో మధ్య ప్రధాని మోదీ రోడ్ షో జరగనుంది. అనంతరం ప్రధాని మోదీ ఐఎన్ఎస్ చోళకు చేరుకొని, ముందుగా బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో భేటీ కానున్నారు. అలాగే ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కూడా ఉండనున్నట్టు తెలుస్తుంది. గురువారం రాత్రికి ఐఎన్ఎస్ చోళలో ప్రధాని బస చేయనున్నారు.
ఇక శనివారం ఉదయం 10.30 గంటలకు ఆంధ్రాయూనివర్సిటీ గ్రౌండ్ లో జరగనున్న బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ సభనుంచే ప్రధాని మోదీ రూ.15,233 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సభలో ప్రధానితో పాటుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా పాల్గొననున్నారు. మరోవైపు విశాఖలో ప్రధాని మోదీ సభ కోసం ఇప్పటికే విస్తృత చేశారు. ఈ సభకు మూడు లక్షల మంది ప్రజలు హాజరు కానున్నట్టు తెలుస్తుంది. అలాగే దాదాపు 10000 మంది కేంద్ర, రాష్ట్ర బలగాలతో విశాఖలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖలో సభ అనంతరం ప్రధాని మోదీ విశాఖ విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి తెలంగాణలోని రామగుండం పర్యటనకు వెళ్లనున్నారు.
విశాఖలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న ప్రాజెక్టులు ఇవే:
- శ్రీకాకుళం-గజపతి కారిడార్లో భాగంగా 200 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించిన NH-326Aలోని నరసన్నపేట నుండి పాతపట్నం సెక్షన్ను ప్రధాని జాతికి అంకితం చేస్తారు.
- రూ.2900 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయబడిన ఆంధ్రప్రదేశ్లోని ఒఎన్జిసి యొక్క యు-ఫీల్డ్ ఆన్షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్ను జాతికి అంకితం చేస్తారు.
- రూ.385 కోట్లతో గుంతకల్లులో నిర్మించిన ఐఓసీఎల్ గ్రాస్ రూట్ డిపో నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు.
- రూ.4106 కోట్లతో పూర్తిచేసిన విజయవాడ-గుడివాడ-భీమవరం-నిడదవోలు రైల్వే లైన్, గుడివాడ-మచిలీపట్నం, భీమవరం-నర్సాపురం 221 కిలోమీటర్ల మార్గం యొక్క డబ్లింగ్, విద్యుదీకరణను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
విశాఖలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టులు ఇవే:
- రూ.400 కోట్లతో విశాఖ రైల్వేస్టేషన్ ఆధునీకరణకు శంకుస్థాపన.
- రూ.3750 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టే ఆరు లేన్ల గ్రీన్ఫీల్డ్ రాయ్పూర్-విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్లో ఆంధ్రప్రదేశ్ విభాగానికి శంకుస్థాపన.
- రూ.566 కోట్లతో విశాఖపట్నంలోని కాన్వెంట్ జంక్షన్ నుండి షీలా నగర్ జంక్షన్ వరకు ప్రత్యేక పోర్ట్ రోడ్డుకు శంకుస్థాపన.
- దాదాపు 6.65 (రోజుకు మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు) సామర్థ్యంతో గెయిల్ యొక్క శ్రీకాకుళం-అంగుల్ సహజ వాయువు పైప్లైన్ ప్రాజెక్ట్కు శంకుస్థాపన. రూ.2650 కోట్లకు పైగా వ్యయంతో 745 కి.మీ పొడవుగా ఈ పైప్లైన్ను నిర్మించనున్నారు.
- దాదాపు రూ.150 కోట్లు వ్యయంతో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ మరియు అప్గ్రేడేషన్కు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE