ఏపీలో మరో మంత్రి సీటుకు ఏపీ సీఎం జగన్ ఎసరు పెట్టేశారు. ఇప్పటికే గుడివాడ అమర్నాథ్ పొలిటికల్ కెరీర్ అయోమయంలో పడేసిన జగన్..గుమ్మనూరు జయరామ్ ను సైడేసేసారు. ఇప్పుడు ఏమీ లేని విషయాలకు కూడా ఎగిరెగిరి పడే అంబటి రాంబాబు వంతు వచ్చింది. ఈ సారి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి టికెట్ ఇవ్వకుండా గట్టి ఝలక్ ఇచ్చారు. రాంబాబును తప్పించి రాంబాబు సోదరుడు అంబటి మురళికి ఏపీ సీఎం జగన్ టికెట్ కేటాయించారు. పొన్నూరు అభ్యర్థిగా మురళికి సీటు ఖరారు చేసి.. అంబటి రాంబాబుపై వేటు వేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చేసారు. దీంతో చీటికి మాటికి ప్రతిపక్షనేతలతో అంత నోరు పెట్టుకుని లేచే అంబటి రాంబాబు..టోటల్గా సైలెంట్ మోడ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
వైసీపీలోనే కొన్నాళ్లుగా అంబటి మురళి కొనసాగుతున్నా పెద్దగా గుర్తింపు లేదు. అలా అని ఆశావాహుల లిస్టులో కూడా ఆయన లేరు. అయినా సరే ఏ సర్వేలను నమ్మారో.. ఏ లెక్కలు వేసుకున్నారో కానీ అంబటి మురళికి పొన్నూరు టికెట్ ను జగన్ ఇచ్చేసారు. ఇటు సత్తెనపల్లిలో అంబటి రాంబాబుపై నెగిటివిటీ పెరిగిపోయి గెలుపు గుర్రాల రేసులో బాగా వెనుకబడినట్లు జగన్ గుర్తించారు. పైగా రాంబాబు వ్యతిరేక వర్గం అక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈసారి అక్కడ నుంచి అంబటి రాంబాబు పోటీ చేసినా కూడా ఓటమి ఖాయమని జగన్ సర్వేలలో తేలిందట.
అందుకే ఈ సారి అక్కడ అభ్యర్థిని మార్చితే గాని పరిస్థితి అదుపులోకి రాదని భావించిన జగన్.. అక్కడ అనూహ్యంగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఆర్కే ఆ హామీ తోనే వైసీపీలో తిరిగి చేరారని ప్రచారం జరుగుతోంది. మంగళగిరిలో బీసీ అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వాలని.. సత్తెనపల్లి లేదా గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని తీసుకోవాలని ఆర్కేకి అప్పుడు జగన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తనకు సత్తెనపల్లి కావాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి కోరడంతో..అంబటి సోదరుడు మురళిని పొన్నూరుకు పంపించి..సత్తెనపల్లిని రామకృష్ణారెడ్డికి ఖరారు చేశారు.
మరోవైపు ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాకపోవడంతోనే ఏమో.. సత్తెనపల్లి టికెట్ తనదేనన్న నమ్మకంతోనే ఇన్నిరోజులు అంబటి రాంబాబు ఉన్నారట. అప్పుడే ప్రచారం కూడా మొదలుపెట్టి తనలోని కళా నైపుణ్యాలను కూడా బయట పెట్టేశారట. టీ పెట్టడం, అక్కడున్నవారందరితో కలిసి టీ తాగడం, దోసెలు వేయడం వంటి పనులతో బిజీబిజీగా గడిపారట. అయితే జగన్ స్కెచ్ మరోలా ఉండటంతో అంబటి ఫ్యామిలీలో తమ్ముడిని లైన్ లో పెట్టి అన్నను సైడేసారన్న టాక్ నడుస్తోంది. ఇప్పుడు అంబటి రాంబాబు పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారయిందట. మరో గత్యంతరం లేక..పార్టీ విశాల ప్రయోజనాలు , అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటాననే మాటలు మాత్రమే అంబటి నోట వినిపిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE