అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఏపీలో రెండు ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉంది. ఈక్రమంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ స్పీడ్ పెంచేశారు. వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ప్రత్యర్థులకు ఏమాత్రం అందని రీతిలో వ్యూహాలను రచిస్తున్నారు. ఇప్పటికే 58 అసెంబ్లీ స్థానాలకు.. 10 లోక్ సభ స్థానాలకు జగన్ అభ్యర్థులను ప్రకటించేశారు. అతి త్వరలోనే మిగిలిన స్థానాలకు కూడా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ సారి జనసేనను ఢీ కొట్టేందుకు కొందరు సినీ ప్రముఖులను జగన్ రంగంలోకి దింపుతున్నారు.
ప్రముఖ డైరెక్టర్ వీవీ వినాయక్, రెబల్ స్టార్ కృష్ణం రాజు సతీమణి శ్యామలాదేవి, హాస్యనటుడు ఆలీని లోక్ సభ ఎన్నికల బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు మరో ప్రముఖ సినీ నటుడిని కూడా రంగంలోకి దింపేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హీరో సుమన్ను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారట. రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి సుమన్ను పోటీ చేయించాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారట.
ప్రస్తుతం రాజమండ్రి సిట్టింగ్ ఎంపీగా మార్గాని భరత్ ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో భరత్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈక్రమంలో రాజమండ్రి లోక్సభ టికెట్ ఎవరికి దక్కుతుందనే దానిపై కొద్దిరోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది. రాజమండ్రి నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దించాలని జగన్ అనుకుంటున్నారట. ఈక్రమంలో మొన్నటి వరకు రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేరు తెరపైకి వచ్చింది. ఈసారి ఆయనకే రాజమండ్రి టికెట్ కాన్ఫామ్ అని గుసగుసలు వినిపించాయి. అటు నియోజకవర్గంపై కూడా ఆయనకు మంచి పట్టు ఉంది.
అయితే ఇప్పుడు అనూహ్యంగా శ్రీనివాస్ పేరు కాకుండా.. సుమన్ పేరు వినిపిస్తోంది. జగన్ అనుకున్నట్లుగానే సుమన్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. ఈక్రమంలో ఆయన్ను పోటీ చేయించాలని జగన్ అనుకుంటున్నారట. ఇప్పటికే వైసీపీ హైకమాండ్ సుమన్తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అటు సుమన్ కూడా రాజమండ్రి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ