నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు, బెయిల్ పిటిషన్ కు సంబంధించి శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ తరపున ముకుల్ రోహత్గీ, ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు అనంతరం ఎంపీ రఘురామకృష్ణరాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఎంపీపై నమోదైన అభియోగాలకు కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం లేదని, ఎంపీ అభ్యర్ధన మరియు ఇటీవలే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నందున ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేస్తునట్టు పేర్కొంది. ఎంపీ దర్యాప్తుకు సహకరించాలని, దర్యాప్తు అధికారి పిలిచినప్పుడు విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. కాగా కేసు విచారణకు దర్యాప్తు అధికారులు 24 గంటల ముందు ఎంపీకి నోటీసు ఇవ్వాలని, కేసుతో సంబంధంలేని న్యాయవాది సమక్షంలో విచారణ ఉండాలని పేర్కొంది. అలాగే పిటిషనర్ ఈ కేసుపై ప్రింట్ లేదా విజువల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు సూచించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ