ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిషత్ ఎన్నికలపై (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) శుక్రవారం నాడు రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా పోలింగ్ కు నాలుగు వారాలు నోటిఫికేషన్ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని కోర్టు పేర్కొంది. రాష్ట్రంలో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో ఏప్రిల్ 8న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలు వలన కౌంటింగ్ పక్రియ నిర్వహించలేదు.
ముందుగా ఎన్నికల నిర్వహణపై టీడీపీ, జనసేన సహా పలు పార్టీలు హైకోర్టులో పిటిషన్స్ దాఖలు చేశాయి. పోలింగ్ తేదీకి 4 వారాల ముందు ఎలక్షన్ కోడ్ విధించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణ తర్వాత ఎన్నికల పక్రియను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అనంతరం ఆ ఉత్తర్వులుపై రాష్ట్ర ఎన్నికలసంఘం కోర్టులో సవాల్ చేయగా, ఎన్నికల పక్రియ నిలిపివేతపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుపుకోవచ్చని కోర్టు స్పష్టం చేస్తూ, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కౌంటింగ్ పక్రియను నిలిపివేయాల్సిందిగా ఎస్ఈసీకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
కోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్ఈసీ నోటిఫికేషన్ కు అనుగుణంగా రాష్ట్రంలో ఏప్రిల్ 8న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. అనంతరం ఎన్నికల నిర్వహణ, ఫలితాలు వెల్లడిపై హైకోర్టులో పలుమార్లు విచారణ జరిగింది. ఈ క్రమంలో విచారణ పూర్తికాగా ఎన్నికలను రద్దు చేస్తూ, నిబంధనలకు అనుగుణంగా మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. అయితే కోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో కానీ, సుప్రీంకోర్టులో కానీ సవాల్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ