తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం-2022 ను ప్రారంభించారు. మంగళగిరిలో గల పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉండవల్లి గ్రామ టీడీపీ నేతల ద్వారా చంద్రబాబు తన సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకుని పార్టీకి రూ.లక్ష విరాళం అందించారు. ఈసారి పార్టీ సభ్యత్వం తీసుకోవాలనుకుంటే ఉన్నచోటు నుంచే మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి సభ్యత్వం తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. వాట్సాప్, టెలిగ్రామ్, మన టీడీపీ యాప్ల ద్వారా కొత్త సభ్యత్వం పొందవచ్చని, అలాగే ఇప్పటికే సభ్యత్వం ఉన్నవారు రెన్యూవల్ చేసుకోవచ్చని చెప్పారు. వీటితో పాటుగా ఎప్పటిలాగానే గ్రామంలో, మండలంలో, నియోజకవర్గాల్లో ఉండే టీడీపీ కార్యాలయాల్లో సభ్యత్వం తీసుకోవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పార్టీలో సీనియార్టీని గౌరవిస్తామని, సిన్సియార్టీని గుర్తిస్తామని స్పష్టం చేశారు. అలాగే 40శాతం టికెట్లు యువతకు ఇద్దామన్న నిర్ణయానికి పార్టీ కట్టుబడి ఉందన్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా పార్టీ కార్యాలయం చుట్టూ తిరిగే నాయకులకు చెక్ పెడతామని అన్నారు. సమాజ మంచి కోసం టీడీపీ అవసరముందని, ఈ నేపథ్యంలోనే విరాళాల సేకరణ చేపడుతున్నామని చెప్పారు.
అలాగే నారా లోకేష్ మాట్లాడుతూ, టీడీపీకి బలం కార్యకర్తలేనని, దేశంతో పాటుగా ప్రపంచంలో ఎక్కడా ఉన్నా కూడా కార్యకర్తలందరూ పార్టీ జెండాలు దించకుండా పోరాడుతున్నారన్నారు. పార్టీ కార్యకర్తలను అన్నిరకాలుగా ఆదుకోవడానికే సభ్యత్వ నమోదుకి శ్రీకారం చుట్టామన్నారు. కార్యకర్తలు ప్రమాదవశాత్తూ చనిపోతే ప్రమాద బీమా కింద వారి కుటుంబ సభ్యులకు రూ.2లక్షలు అందిస్తున్నామని చెప్పారు. కార్యకర్తల సంక్షేమంలో ఇప్పటిదాకా 1.O చూశామని, ఇకపై 2.O కొత్తవెర్షన్ చూడబోతున్నామని నారా లోకేష్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ