తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండు రోజుల ‘మహానాడు’ కార్యక్రమం రాజమహేంద్రవరంలో శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధుల సభ రిజిస్టర్లో తొలి సంతకం చేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, వేదిక మీద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహానాడుకు హాజరైన పార్టీ నేతలను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘మన నాయకుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్ శకం కూడా ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్ వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సి గురుతర బాధ్యత టీడీపీపై ఉంది. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ హయాంలో వచ్చిన పుష్కరాల సందర్భంగా రాజమండ్రిని రాజమహేంద్రవరంగా పేరు మార్చాం.
ఇంకా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ‘టీడీపీకి సంపద సృష్టించడం తెలుసు.. దానిని పేదలకు పంచడమూ తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో పేదలకు ఫించన్లివ్వడం మొదలు పెట్టింది కూడా టీడీపీనే. అభివృద్ధి అంటే మొదట గుర్తొచ్చేది టీడీపీనే. టీడీపీ విజన్ ఏంటో హైదరాబాద్ చూస్తే తెలుస్తుంది. విభజన జరిగిన తర్వాత ఏపీని దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ధీటుగా అభివృద్ధిలో ముందుకు నడిపించాం. అయితే నాలుగేళ్ళ క్రితం కొత్తగా వచ్చిన ఒక నాయకుడు ఒక్క ఛాన్స్ అంటే.. ప్రజలు నమ్మి మోసపోయారు. ఆయన పాలనలో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మూడు రాజధానులు కడతామంటూ చివరకు ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారు. టీడీపీ హయాంలో 70 శాతం పూర్తయిన పోలవరాన్ని పూర్తి చేయలేకపోయారు. నిరుద్యోగులకు ప్రతియేటా జాబ్ క్యాలెండర్ అని మభ్యపెట్టి, ఒక్క ఉద్యోగం ఇవ్వలేకపోయారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతానని బీరాలు పలికి చివరకు తన మెడనే వంచేశారు’ అని చెప్పారు.
ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ ఇలా అన్నారు.. ‘టీడీపీ సైకిల్కి ఉన్న రెండు చక్రాలు సంక్షేమం, అభివృద్ధికి సంకేతం. నాలుగేళ్లపాటు టీడీపీ కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారు. అయినా ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో వెనుకడుగు వేయలేదు. నేతలపై వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెడుతున్నా.. ఏ ఒక్కరూ భయపడలేదు. జై తెలుగుదేశం అంటూ ప్రాణాలొదిలిన కార్యకర్తలు ఎందరో ఉన్నారు. అలాంటి కార్యకర్తల త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నా. భవిష్యత్తులో కార్యకర్తలని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను. వారి కుటుంబంలో ఒకడిగా ఉండి ఆదుకుంటాను. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయి. అన్న ఎన్టీఆర్ స్పూర్తితో ప్రతి ఒక్కరూ పోరాడాలి. ఈసారి వచ్చేది మన ప్రభుత్వమే. అందులో ఎలాంటి సందేహం లేదు’ అని చంద్రబాబు ప్రసంగించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE