మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “తెలుగువారికి గర్వకారణంగా జాతీయ రాజకీయాలకు వన్నె తెచ్చిన తెలుగు వెలుగులు ఎన్టీఆర్ మరియు పీవీ నరసింహారావులు. దేశంలో పేదల సంక్షేమానికి బాటలువేసింది ఎన్టీఆర్ అయితే, ఎన్నో సంస్కరణలు తెచ్చి దేశ ఆర్థికరంగాన్ని పరుగులు పెట్టించడమే కాకుండా, సాంకేతిక ఫలాలను పేదలకు అందించిన మేధావి పీవీ. ఇటువంటి మహానీయులను రాజకీయ ప్రయోజనాల కోసం రచ్చకీడుస్తారా? హైదరాబాద్ అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పాత్ర అందరికీ తెలుసు. అటువంటి పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ సమాధిని కూల్చాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. నిస్వార్థ రాజకీయాలతో, ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయే పథకాలతో తెలుగువారి ఆరాధ్య దైవంగా నిలిచిన ఎన్టీఆర్ పై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం తెలుగువారందరినీ అవమానించడమే” అని చంద్రబాబు పేర్కొన్నారు.
ముందుగా బుధవారం నాడు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, హుస్సేన్ సాగర్ పై ఉన్న పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలని వ్యాఖ్యలు చేశారు. “‘నగరంలో అక్రమ కట్టడాలు, ఇళ్లును కూల్చేస్తామని రాష్ట్రప్రభుత్వం అంటుంది. ఒకప్పుడు 4,700 ఎకరాలు ఉన్న హుస్సేన్సాగర్ ఈరోజు 700 ఎకరాలు కూడా లేదు. దమ్ముంటే హుస్సేన్సాగర్పై ఉన్న పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలి” అని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ