ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు అడపాదడపా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీల పొత్తులపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శుక్రవారం నాడు అన్నవరంలో టీడీపీ కార్యకర్తలతో భేటీలో ఆయన పొత్తులపై వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రం బాగు కోసం అందరూ ఏకమవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. దీనిపై ఆలోచించాలని రాష్ట్రంలోని మిగిలిన పార్టీలకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల కోసం అందరూ కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తనకు ఎవరిపైనా వ్యతిగత కోపం లేదని, కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని చంద్రబాబు తెలిపారు.
ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమం రావాలని, ఈ ఉద్యమానికి తెలుగుదేశం నాయకత్వం వహిస్తుందని పేర్కొన్నారు. దీనికోసం అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీలో ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. దీంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉండొచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ వ్యాఖ్యల ద్వారా ఎన్నికలలో పొత్తులకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని ఆయన ఇచ్చినట్లయింది. అయితే దీనిపై జనసేన, బీజేపీ ఎలా స్పందిస్తాయనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే, ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ