అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో శనివారం చోటు చేసుకున్న ఘటనలపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలో తమ పార్టీ నేతలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. అలాగే ఘర్షణ సందర్భంగా పార్టీ సీనియర్ నేత, పల్లె రఘునాథ్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయిన నేపథ్యంలో పార్టీలోని జిల్లా ముఖ్య నేతలకు ఫోన్ చేసి పరామర్శించారు. ఇక వైసీపీ శ్రేణుల దాడిలో పార్టీ నేతల వాహనాలు ధ్వంసం కావడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. ‘పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వాహనంపై, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతిరోజూ దాడులు సమాధానం కాలేవు. వైసీపీ దాడుల వెనుక వారి ఓటమి భయం, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది’ అని పేర్కొన్నారు.
కాగా ఈరోజు ఉదయం పుట్టపర్తిలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ), ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. యువగళం పాదయాత్రలో భాగంగా టీడీపీ నేత నారా లోకేష్ చేసిన అవినీతి ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్పందించారు. బహిరంగ చర్చకు సిద్ధమన్న ఆయన వ్యాఖ్యలపై పల్లె రఘునాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో ముందుగా సవాల్ చేసుకున్న సమయానికి ఇరువురు నేతలు ఈరోజు ఉదయం సత్యమ్మ దేవలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గీయులు రాళ్లు, చెప్పులతో పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసుల సమక్షంలోనే ఇరు వర్గాలు దాడులు ప్రతిదాడులకు దిగారు. దీంతో ఒక్కసారిగా అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ దాడుల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఇరువురి వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ సందర్భంగా చోటుచేసుకున్న తోపులాటలో పల్లె రఘునాథ్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. మరోవైపు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని సత్తెమ్మ దేవాలయం వద్దకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించడంపై టీడీపీ శ్రేణులు మండిపడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE