టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం మార్చారు. వచ్చే ఎన్నికలకు తగ్గట్టుగా పార్టీ నిర్మాణంలో మార్పులు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు కీలక మార్పులు చేశారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్ బాటలోనే బాబు పయనిస్తున్నారా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. రాయలసీమలో ఎన్నడూ లేని రీతిలో బీసీలకు ప్రాధాన్యతనిచ్చేందుకు బాబు సంకల్పించినట్టు కనిపిస్తోంది.
కర్నూలు. నంధ్యాల జిల్లా టీడీపీ అధ్యక్షులను మార్చారు. గతంలో ఉన్న ఇద్దరు నేతలను బాధ్యతల నుంచి తప్పించి, కొత్త వారికి అవకాశం ఇచ్చారు. దాంతో భాగంగా కర్నూలు అధ్యక్షుడిగా ఉన్న సోమిశెట్టి వెంకటేశ్వర్లకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. ఈ వైశ్య నేత టీడీపీలో సుదీర్ఘకాలంగా ఉన్నారు. చంద్రబాబు వెంట సాగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన స్థానంలో బోయ కులానికి చెందిన బీటీ నాయుడికి బాధ్యత అప్పగించారు. ఇప్పటికే అధికార వైఎస్సార్సీపీ బీసీలకు ప్రాధాన్యతనిస్తోంది. వరసుగా మంత్రి జయరామ్ తో పాటుగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి, ఎమ్మెల్సీ కూడా బోయలకు కేటాయించారు. తద్వారా బోయ ఓట్లను కాపాడుకునే యత్నంలో ఉన్నారు. దానికి విరుగుడుగా ఇప్పుడు చంద్రబాబు కర్నూలు ఇన్ఛార్జ్ పదవిని బోయ నేత బీటీ నాయుడిని తెరమీదకు తీసుకురావడం ఆసక్తిగా మారింది.
వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటు ఆయనకే కేటాయిస్తారా అనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని బరిలో దింపినా టీడీపీకి ఫలితం దక్కలేదు. 2014,19లో కూడా కర్నూలు ఎంపీ సీటు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఆపార్టీ తరుపున చేనేత కులాల నేతలను బరిలో దిగి విజయం సాధించారు. దాంతో ఈసారి బోయలను బరిలో దింపి ఢీకొట్టే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక నంద్యాల విషయంలో కూడా చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గౌరు వెంకటరెడ్డిని తొలగించి ఆయన స్థానంలో మాజీ జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ గౌడ కి అవకాశం ఇచ్చారు. గౌరు వెంకటరెడ్డి నందికొట్కూరు, ఆయన భార్య గౌరు చరిత పాణ్యం ఇన్ఛార్జులుగా ఉన్నారు. దాంతో వారికి నియోజకవర్గాల్లో కేంద్రీకరించేందుకు వీలుగా వెంకటరెడ్డి సూచించిన గౌడ ని తెరమీదకు తెచ్చినట్టు చెబుతున్నారు. దాంతో అక్కడ కూడా ఎంపీ టికెట్ బీసీ నేతలకు ఇస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. రాయలసీమలోని ఎంపీ సీట్లలో గత ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యతనిచ్చిన జగన్ ఫలితం దక్కించుకున్నారు. సరిగ్గా ఇప్పుడు దానినే జగన్ అనుసరించబోతున్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ ప్రయత్నం ఫలిస్తుందా లేదా అన్నది చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE