ఏపీలో గిరిజన ప్రాంతాల్లో వైఎస్సార్సీపీకి గట్టిపట్టుంది. వరుసగా రెండు సాధారణ ఎన్నికల్లోనూ ఆపార్టీ తిరుగులేని విజయాలు సాధించింది. ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను దాదాపుగా దక్కించుకుంది. 2019లో మొత్తం అన్ని స్థానాలు ఆపార్టీ ఖాతాలో పడగా, 2014లో కేవలం పోలవరం మాత్రమే చేజార్చుకుంది. దాంతో గిరిజనుల్లో వైఎస్ జగన్ కి విశేష ఆదరణ ఉన్నట్టు చెబుతారు.
మరోసారి సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన పట్టు సడలకుండా చూసుకోవాలని ఏపీలో అధికార పక్షం ఆశిస్తోంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ వైఖరి పట్ల ఏజన్సీ వాసుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ముఖ్యంగా పోలవరం ముంపు మండలాల్లో జగన్ హామీలు అమలుకాకపోవడంతో ఆగ్రహం పెరుగుతోంది. నిర్వాసితులకు తాను అధికారంలోకి వస్తే రూ. 10లక్షలు చొప్పున ప్యాకేజీ ఇస్తానంటూ 2018లో జగన్ హామీ ఇచ్చారు. కానీ అది నేటికీ అమలుకాలేదు. అంతేగాకుండా 2022 వరదల సమయంలో ముంపు బాధితులందరికీ పరిహారం చెల్లిస్తానంటూ చింతూరులో ప్రకటించారు. రెండు నెలల్లో బాధితులందరికీ న్యాయం చేస్తామని చెప్పినా, అది అమలుకాలేదు. దాంతో జగన్ మాటలు చెప్పడం తప్ప తమకు న్యాయం చేయడం లేదనే అభిప్రాయం బలపడుతోంది.
సీపీఎం నేతలు ఇటీవల పోలవరం పొలికేక మహాపాదయాత్ర పేరుతో కార్యాచరణకు పూనుకున్నారు. గతంలో తాము ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంలో ఉన్న గిరిజనులతో ఎటపాక నుంచి విజయవాడ వరకూ ఈ పాదయాత్ర నిర్వహించారు. దానికి ముంపు ప్రాంతంలో మంచి స్పందన వచ్చిందని చెబుతున్నారు. దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని సీపీఎం ఆశిస్తోంది. అది ఎంతమేరకు అన్నది పక్కనపెడితే సీపీఎం యాత్రకు టీడీపీ, జనసేన వంటి విపక్షాలన్నీ అండగా నిలిచారు. ఆయా పార్టీల నేతలు కూడా యాత్రలో పాల్గొన్నారు. దాంతో విపక్షాలన్నీ ఒక్కటయితే మాత్రం అది అధికార వైఎస్సార్సీపీకి నష్టం చేస్తుంది. పైగా పోలవరం పేరుతో గిరిజనులను ముంచేస్తున్నారనే ప్రచారం విస్తృతమయితే రాష్ట్రవ్యాప్తంగా ఏజన్సీ వాసుల్లో దాని ప్రభావం పడుతుంది. దాంతో నిర్వాసితుల పునరావాసం, పరిహారం విషయంలో ప్రభుత్వం కూడా కదలక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. రాజకీయంగా నష్టం చేసే వ్యవహారం కావడంతో పాలక పార్టీ అప్రత్తమయ్యింది. ఈనెల 5న ఉన్నతస్థాయి సమావేశానికి నీటిపారుదల శాఖ సిద్దమవుతోంది. దాంతో పోలవరం నిర్వాసితుల అంశం మరోసారి తెరమీదకు వచ్చినట్టయ్యింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE