ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని కేంద్రం పార్లమెంట్ వేదికగా స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ అంశంపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. దీనిపై గురువారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధంగానే ఏర్పాటు అయిందని కేంద్రం నిన్న పార్లమెంటులో తెలిపిందని, దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. అవగాహన లేకుండా మూడు రాజధానులంటూ హడావిడి చేస్తున్నారని, కేంద్రం ప్రకటన తర్వాత అయినా ఆయన తన నిర్ణయం మార్చుకోవాలని సూచించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. అలాగే ఏపీ రాజధానిపై నిన్న సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ వేసిందని, ఈ సందర్భంగా శివరామకృష్ణ కమిటీ నివేదికను కోర్టులో ప్రస్తాస్తూ ఈ నివేదికను రాష్ట్రానికి పంపామని వెల్లడించిందని చెప్పారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని, ఆ నిర్ణయాన్ని తాము ఆమోదించామని కూడా కేంద్రం కోర్టుకు తెలిపింది. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తమను సంప్రదించకుండానే 3 రాజధానుల చట్టం తెచ్చిందని, కేంద్రం అఫిడవిట్లో స్పష్టంగా తెలిపింది. చట్టంలో లేని అధికారాన్ని సీఎం జగన్ తనకు ఉన్నట్లు భావిస్తున్నారని, చట్టానికి వ్యతిరేకంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అమరావతి ఏర్పాటు రహస్యంగా చేసింది కాదని, నాడు ప్రధాని మోదీ స్వయంగా వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారని, అమరావతికి అండగా ఉంటానని హామీ ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు.
అసెంబ్లీ సాక్షిగా అప్పడు ప్రతిపక్ష నేత స్థానంలో ఉండి జగన్ చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తుందేంటి? అని ప్రశ్నించిన చంద్రబాబు.. మొదట అనుకులమని చెప్పిన జగన్ ఆ తర్వాత అమరావతిపై మాట మార్చారని మండిపడ్డారు. వాస్తవాలు ఇలా ఉంటే.. రాష్ట్రానికి సంబంధించి చట్టాలు చేసే హక్కు శాసనసభకు లేదా అంటూ వక్రీకరించి మాట్లాడారని, కౌన్సిల్ రద్దు చేయడానికి అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టారని, అయితే ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇక నాడు టీడీపీ ప్రభుత్వాన్ని నమ్మి రాజధాని ఏర్పాటుకు ఆ ప్రాంత రైతులు స్వచ్ఛందంగా వేలాది ఎకరాల భూమి ఇచ్చారని, కానీ నేడు వారు తమకు న్యాయం చేయమని వెయ్యి రోజులకు పైగా ఉద్యమాలు చేస్తున్నారని, దీనికి కారణం వైసీపీ ప్రభుత్వ అసమర్ధ నిర్ణయాలేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ పార్టీ నేతలకే సీఎం జగన్ పైన నమ్మకం లేదని, ఆయన కూడా వారిని నమ్మరని, అందుకే వారి ఎమేల్యేల ఫోన్లని ట్యాపింగ్ చేయిస్తున్నారని చంద్రబాబు అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE