తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు వేడుకలు ఈ ఏడాది మే నెలలో ప్రారంభం కానున్నాయి. ఈసారి ప్రకాశం జిల్లా ఒంగోలులో మహానాడును నిర్వహించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అయితే మే 27న ప్రారంభం కానున్న మహానాడు కార్యక్రమం ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై పొలిట్ బ్యూరోలో చర్చించి టీడీపీ అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. మహానాడులో భాగంగా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కార్యక్రమం ఉంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల నియామకాన్ని జాతీయ అధ్యక్షుడు ఖరారు చేస్తారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా మే నెల 27-29 వరకు మహానాడు వేడుకలు నిర్వహించటం పార్టీ ఒక ఆనవాయితీగా పాటిస్తోంది.
తెలుగుదేశం పార్టీ విధి విధానాలపై మరియు పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఈ మూడు రోజులూ చర్చ జరుపుతారు. పార్టీలో అంతర్గతంగా పలు అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. కాగా గడచిన రెండు, మూడేళ్ళుగా మహానాడు నిర్వహణ కుదరలేదు. ఒక ఏడాది ఎన్నికల కారణంగా నిర్వహించలేకపోగా, తరువాతి రెండు సంవత్సరాలు కోవిడ్ మహమ్మారి కారణంగా జరగలేదు. దీంతో ఈసారి కార్యక్రమాన్ని భారీగా నిర్వహించటానికి పార్టీ ఏర్పాట్లు చేయనుంది. ఏర్పాట్లకు సంబంధించి పలు కమిటీలను వేయనున్నట్లు పార్టీ ప్రతినిధులు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడుపై చర్చించటానికి త్వరలోనే పొలిట్ బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ