హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో రోగుల సహాయకులకు ఇకపై రూ.5 ఆహార పథకాన్ని త్వరలో అందించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వాస్పత్రుల్లో రూ.5 కే భోజనాన్ని పెట్టనున్నట్లు సంస్థ తెలిపింది. హైదరాబాద్ నగరానికి ఇతర జిల్లాల నుంచి వైద్యసేవల కోసం ఎంతోమంది రోగులు వస్తుంటారు. వారితో పాటు ఎవరో ఒకరు రోగి వెంట సహాయకులుగా వస్తుంటారు. అయితే ఒక్కోసారి ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చినప్పుడు మాత్రం వీరికి అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. వీరికి ఆస్పత్రుల వద్ద సరైన వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాటిలో ప్రధానమైనది భోజన వసతి. ఇప్పుడు వీరి బాధలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం రోగుల సహాయకులకు ఇకపై రూ.5 భోజనాన్ని అందించటానికి ఏర్పాట్లు చేస్తోంది.
కాగా వీరికి రూ. 5 లకే నాణ్యమైన భోజనం అందించేందుకు హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున టీఎస్ ఎంఐడీసీతో కలిసి ఈ సంస్థ పనిచేయనుంది. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం యేటా రూ. 38.66 కోట్లు కేటాయించనుంది. రోగుల సహాయకులకు రూ.5కే పరిశుభ్రమైన భోజనం వేడి వేడిగా అందిస్తామని హరే కృష్ణ ట్రస్ట్ తెలిపింది. అలాగే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల అటెండర్లకు నైట్ షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని, త్వరలోనే అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నైట్ షెల్టర్లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ