ప్రతి సంవత్సరం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రెండు, మూడు రోజుల పాటు మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ పార్టీ అత్యంత కోలాహలంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కరోనా వ్యాప్తి కారణంగా ఆన్లైన్ లో జూమ్ యాప్ ద్వారా మహానాడు ను రెండు రోజుల పాటు నిర్వహించాలని టీడీపీ పార్టీ నిర్ణయించింది. జూమ్ యాప్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 14 వేల మందికి పైగా ఈ మహానాడులో పాల్గొంటారని పార్టీ సభ్యులు వెల్లడించారు. ముందుగా బుధవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాళులర్పించి, పార్టీ జెండా ఆవిష్కరించి మహానాడును ప్రారంభించనున్నారు.
మరోవైపు టీడీపీ డిజిటల్ మహానాడు -2020 నిర్వహణపై చంద్రబాబు ట్విట్టర్లో స్పందించారు. “సాంకేతిక పరిజ్ఞానం అనేది ఎలాంటి సమస్యలకైనా ఒక పరిష్కారం చూపుతుందనే నా నమ్మకం ఎప్పటికప్పుడు బలపడుతూనే ఉంది. లాక్డౌన్ కాలంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే డిజిటల్ సోషలైజేషన్ దిశగా మనం వెళ్ళామంటే దానికి కారణం సాంకేతికత. ఈసారి జరుగుతున్న డిజిటల్ మహానాడు 2020 కూడా అలాంటిదే. ప్రతి ఏడాది అసంఖ్యాక జన సందోహం మధ్య వేడుకగా జరుపుకునే మహానాడుకు ఈసారి లాక్డౌన్ నిబంధనలు అడ్డొచ్చాయి. అయితేనేం జూమ్ వెబినార్ పేరిట సాంకేతికత మనకో మార్గం చూపింది. దేశంలోనే మొదటిసారిగా జరుగుతున్న ఒక డిజిటల్ రాజకీయ సమావేశం మన మహానాడు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులంతా మీ మొబైల్ లేదా ట్యాబులలో జూమ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని మే 27, 28 తేదీలలో జరిగే ఈ డిజిటల్ మహానాడులో పాల్గొనండి. ప్రతి మహానాడు మాదిరిగానే ఈ మహానాడుని కూడా విజయవంతం చేయండని” చంద్రబాబు పిలుపు నిచ్చారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu