ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో, అక్టోబర్ 25 శుక్రవారం నాడు టీడీపీ నాయకుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమావేశమయ్యారు. మంత్రులు పేర్నినాని, కొడాలి నానిలతో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి గంటపాటు ఆయనతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ వైసీపీలో చేరేందుకు ఆశక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. జగన్ గతంలో ప్రకటించిన విధంగా వైసీపీలో చేరడానికి ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేసేందుకు వంశీ సిద్ధపడినట్లు తెలుస్తుంది.
శుక్రవారం ఉదయం బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో వంశీ భేటీ అయి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. గత కొన్ని రోజులుగా టీడీపీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీలో చేరబోతున్నాడనే ఊహాగానాలు వస్తున్నా నేపథ్యంలో సుజనా చౌదరితో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది, అయితే సాయంత్రానికే మంత్రులతో కలిసి జగన్ తో చర్చించడంతో వైసీపీలో చేరడం దాదాపుగా ఖరారయింది. అంతర్గత విభేదాలు, ఇటీవలే ఆయనపై నమోదైన కేసు, రాజకీయ వత్తిళ్ల నేపథ్యంలోనే వంశీ పార్టీ మార్పుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే పార్టీ మారుతున్నట్టు వంశీ నేరుగా ప్రకటించలేదు. నియోజకవర్గ అభివృద్ధి, ఇతర సమస్యలను ముఖ్యమంత్రికి వివరించాను, నిర్ణయం ప్రకటించడానికి అమావాస్య అడ్డుగా ఉంది, దీపావళీ అనంతరం నియోజకవర్గంలో పర్యటించి తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తానని వంశీ తెలియజేశారు.
[subscribe]