టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత జనవరి 23, గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ముందుగా తన భర్త సురేష్తో కలిసి వెళ్లి సీఎం వైఎస్ జగన్ ను కలుసుకున్నారు. శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు సునీత మద్దతూ తెలిపింది. అలాగే టీడీపీ ప్రవేశపెట్టిన రూల్ 71ను వ్యతిరేకిస్తూ వైసీపీకి అనుకూలంగా ఆమె ఓటు వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ మారుతారన్న ఊహాగానాలు మొదలవ్వగా, వాటిని నిజం చేస్తూ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆమె ఆ పదవికి రాజీనామా చేయకుండానే వైసీపీలో చేరారు.
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ బిల్లులు అడ్డుకున్నారని అన్నారు. తన విషయంలో న్యాయపరంగా ఇబ్బందులుంటే తన పదవికి రాజీనామా చేస్తానని ఆమె ప్రకటించారు. రాజధానికి భూములిచ్చిన రైతులను కూడా ఆదుకోవాలని, అలాగే చీరాల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు విన్నవించినట్లు సునీత పేర్కొన్నారు.
[subscribe]