ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై నిరసనలు వరుసగా తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. మందడం వద్ద రైతులు చేపట్టిన ఆందోళనలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిరసన తెలిపే నేపథ్యంలో టెంటు వేసేందుకు పోలీసులు అనుమతిని నిరాకరించడంతో రైతులు, మహిళలు ఒక్కసారిగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో సచివాలయానికి వెళ్లే మార్గం పూర్తిగా దిగ్బంధం అయింది. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి భారీగా చేరుకుని, రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. నిరసన కోసం టెంటు వేసుకునేందుకు అనుమతిస్తే వాహనాలను అడ్డుకోమని రైతులు సమాధానమివ్వగా, కొంత ఉద్రిక్తత అనంతరం ఎట్టకేలకు పోలీసులు అనుమతిచ్చారు. రైతులు ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని సచివాలయానికి వెళ్లే మార్గాలు, గ్రామాల్లో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. భారీ బందోబస్తుతో పలు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు.
మరో వైపు టీడీపీ నాయకుడు, విజయవాడ ఎంపీ కేశినేని నానిని పోలీసులు ఈ రోజు గృహ నిర్బంధం చేశారు. అమరావతి ప్రాంతంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిని కొనసాగించాలని ప్రకాశం బ్యారేజీపై నిరసన కార్యక్రమానికి అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. అయితే భద్రతా కారణాలు, మంత్రివర్గ సమావేశం దృష్ట్యా పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద తలపెట్టిన నిరసనకు టీడీపీ ఎంపీ కేశినేని నాని వెళ్తారనే ఉద్దేశంతో, విజయవాడలోని ఆయన స్వగృహంలోనే నిర్బంధించారు. నాని ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అలాగే టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ రోజు ఉదయం పోలీసులు ఆయన ఇంటికి చేరుకుని, ప్రకాశం బ్యారేజీ వద్ద నిరసనలో పాల్గొనకుండా ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు.
[subscribe]