టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాజయం తర్వాత పార్టీలో మళ్ళీ జవసత్వాలు నింపాలని, తద్వారా వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికార వైఎస్సార్సీపీకి గట్టి పోటీ ఇచ్చేలా తయారు చేయాలని నిశ్చయించుకున్నారు. దీనికోసం ఆయన టీడీపీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేయడానికి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మొత్తం ప్రజల్లోనే ఉండేలా, ప్రజలతో మమేకమయ్యేలా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని లోకేశ్ భావిస్తున్నారు. కాగా దీనిపై ఎప్పటినుంచో పార్టీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు పాదయాత్ర తేదీలు కూడా వాయిదా పడ్డాయి.
ఇక నారా లోకేశ్ నిర్ణయానికి పార్టీ సీనియర్ నేతలు కూడా మద్దతు పలికినట్లు తెలుస్తోంది. యువతను ఆకట్టుకోవడం ద్వారా పార్టీలో కొత్త జోష్ నింపడానికి యువకుడైన లోకేష్ పాదయాత్ర చేపట్టడమే మేలని వారు యోచిస్తున్నారు. దీనికి తన తండ్రి మరియు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనుమతి ఇవ్వడమే తరువాయి అని లోకేష్ సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇక ఈ పాదయాత్రకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి లోకేష్ ఇప్పటికే పార్టీ కోర్ గ్రూప్తో సంప్రదింపులు ప్రారంభించారని సమాచారం. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 2023 జనవరి 27వ తేదీ నుంచి లోకేశ్ పాదయాత్ర మొదలు కానుంది.
కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు సుదీర్ఘంగా కొనసాగనున్న ఈ పాదయాత్రపై తనను కలిసిన నేతలకు లోకేశ్ స్పష్టతనిచ్చినట్లుగా తెలుస్తోంది. జనవరి 26న హైదరాబాద్ నుంచి కుప్పంకు వెళ్లనున్న లోకేష్.. తర్వాతి రోజు పాదయాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే పాదయాత్రకు మధ్యలో ఎక్కడా ఎలాంటి విరామం ఉండదని లోకేశ్ చెప్పినట్లు సమాచారం. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఎక్కువ రోజులు పాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఇక పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ మరికొన్ని రోజుల్లోనే ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. దీనిలో భాగంగా చంద్రబాబు నాయుడు పాదయాత్ర పర్యవేక్షణ కోసం వివిధ టీమ్ లను ఏర్పాటు చేయడానికి పార్టీ సీనియర్ నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE