ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు (ఏప్రిల్ 27, 2022) పదోతరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లు పదో తరగతి పరీక్షలు నిర్వహించని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పది పరీక్షల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. వీటికోసం రాష్ట్ర వ్యాప్తంగా 3776 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి 3,20,063 మంది బాలురు, 3,02,474 మంది బాలికలు కలిపి మొత్తం 6,22,537 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు.
అలాగే ఈ ఏడాది పదో తరగతిలో ఏడు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించడంతో పాటుగా, తొలిసారిగా సమాధానాలు రాసేందుకు విద్యార్థులకు 24 పేజీల బుక్లెట్ ను అందిస్తున్నారు. పరీక్షల్లో కాపీయింగ్, మాల్ప్రాక్టీస్ జరగకుండా రాష్ట్రంలో మొత్తం 156 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 292 సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షణ చేయనున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు భౌతికదూరం పాటించడం, మాస్కు ధరించడం, శానిటైజ్ చేసుకోవడం వంటి నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది పరీక్షలు రాసే పదో తరగతి విద్యార్థులకు పరీక్షకు వెళ్లేప్పుడు, వచ్చేప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయం కూడా కల్పించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ